బాగా లేటైపోయింది గురూజీ

‘భీమ్లా నాయక్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి ఎవరేం మాట్లాడారన్న దాని కంటే.. ఒక వ్యక్తి ఏమీ మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారిందిప్పుడు. ఈ చిత్రానికి మొదట్నుంచి అన్నీ తానై వ్యవహరిస్తూ వచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ప్రి రిలీజ్ ఈవెంట్లో పూర్తిగా సైడైపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఈవెంట్లో పవన్ పక్కన కానీ.. ముందు వరుసలో చిత్ర బృందంలోని ముఖ్యులు, అతిథులు కూర్చున్న చోట కానీ.. పవన్ కనిపించలేదు. అంతే కాక వేదిక మీద కూడా ఉన్నాడంటే ఉన్నాడు అనిపించాడు. 

ఆశ్చర్యకరంగా అసలు ఆయన ప్రసంగమే చేయలేదు. తనను తాను బాగా తగ్గించుకుని కెమెరాల కళ్లల్లోనే పడకుండా చూసుకున్నాడు. త్రివిక్రమ్ ఇలా ఎందుకు చేశాడో అందరికీ తెలుసు. ‘భీమ్లా నాయక్’కు సంబంధించి అన్నీ తానై వ్యవహరిస్తున్నాడని.. దర్శకుడికి సాగర్ చంద్రకు అసలు పేరు రాకుండా చేశాడని.. అతణ్ని డమ్మీని చేసేశాడని ఆయనపై విమర్శలున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా తాను లీడ్ తీసుకుంటే ఈ ఆరోపణలే నిజమవుతాయని.. తనపై మరింత విమర్శలు పెరుగుతాయని త్రివిక్రమ్ భావించినట్లున్నాడు. అందుకే ఇలా తనకు ప్రాధాన్యం దక్కకుండా చూసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఐతే త్రివిక్రమ్ ఇలా చేయడం వల్ల ఇప్పుడు కొత్తగా మారేదేమీ లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జరగాల్సిన ప్రచారం అంతా జరిగిపోయిందని.. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి త్రివిక్రమ్‌దే హవా అన్న విషయం అందరికీ అర్థమైపోయిందని.. స్క్రిప్టు తయారు చేయడం దగ్గర్నుంచి అన్నీ తానై వ్యవహరించడంతో పాటు.. మేకింగ్ టైంలో కూడా సెట్స్‌లో తనే కనిపించడంతో ఈ చిత్రం త్రివిక్రమ్‌దే అన్న అభిప్రాయం జనాల్లోకి బలంగా వెళ్లిపోయిందని.. ఇప్పుడు కొత్తగా ఆ అభిప్రాయం మారే అవకాశమే లేదని.. ఇలా తనను తాను తగ్గించుకోవడం త్రివిక్రమ్ కాస్త ముందే చేయాల్సిందని.. ఇప్పుడు బాగా లేటైపోయిందని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు.