సురేష్ బాబు.. ఇంకో రెండేళ్లు ఇంతేనా?

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో సురేష్ బాబు ఒకరు. ఆయన కుటుంబానికి చెందిన సురేష్ ప్రొడక్షన్స్ ఘన చరిత్ర గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో అత్యధిక చిత్రాలు నిర్మించిన సంస్థల్లో అది ఒకటి. చిన్న, మీడియం, పెద్ద అని తేడా లేకుండా అన్ని రకాల బడ్జెట్లలోనూ సినిమాలు తీసిన సంస్థ ఇది. ఐతే కొన్నేళ్ల నుంచి సురేష్ ప్రొడక్షన్స్‌లో పెద్ద బడ్జెట్ చిత్రాలు పెద్దగా రావట్లేదు. చాలా వరకు చిన్న, మీడియం రేంజ్ సినిమాలే చేస్తూ వస్తున్నారు సురేష్ బాబు.

అది కూడా వేరే వాళ్ల భాగస్వామ్యంతో. ఈ మధ్య అయితే సురేష్ సినిమాల నిర్మాణం పట్ల ఆసక్తి తగ్గిపోయినట్లు కనిపిస్తున్నారు. ఇందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి కొవిడ్ అయితే.. ఇంకోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కరోనా దెబ్బకు నిర్మాతల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా తయారైంది. సినిమాలు నిర్మించడం ఒకెత్తయితే.. వాటిని థియేటర్లలో రిలీజ్ చేసి ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టం మరో ఎత్తుగా మారింది.కొవిడ్ కష్టాలు చాలవని.. టికెట్ల ధరలు, ఇతర విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో సురేష్ బాబు విసుగెత్తిపోయినట్లే ఉన్నారు.

మిగతా ఇండస్ట్రీ పెద్దలు తమ సినిమాలను బయటపడేసేందుకు ఏపీ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఎన్నో విన్నపాలు చేశారు. అయినా ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఐతే సురేష్ బాబు వారిలాగా తగ్గడానికి, ప్రభుత్వం ముందు చేతులు జోడించడానికి  సిద్ధంగా లేరన్నది స్పష్టం. అందుకే ఈ వ్యవహారాలకు దూరంగా ఉండిపోయారు. తన సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేయడం, సినిమాలు నిర్మించడం మానేస్తా కానీ.. తలొగ్గేది లేదన్నట్లుగా ఆయన కనిపిస్తున్నారు. అందుకే ఎగ్జిబిటర్ల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ.. నారప్ప, దృశ్యం-2 చిత్రాలను ఓటీటీల్లోనే రిలీజ్ చేశారు.

‘విరాట పర్వం’ విషయంలోనూ ఇదే బాట పట్టేలా ఉన్నారు. మరోవైపు సురేష్ బాబు కొత్తగా సినిమాల నిర్మాణం చేపట్టే విషయంలోనూ ఆసక్తిని ప్రదర్శించట్లేదు. ఉద్దేశపూర్వకంగా జగన్ సర్కారు సినీ రంగాన్ని ఇబ్బంది పెడుతుండటంతో ఆ ప్రభుత్వం దిగిపోయే వరకు సినిమాల నిర్మాణం జోలికి వెళ్లకూడదన్న ఆలోచనలో ఆయనున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల ఫలితాలను బట్టి ఆయన తదుపరి కార్యాచరణ ఉండేలా కనిపిస్తోంది. అప్పటి వరకైతే సురేష్ బాబు ఇన్ యాక్టివ్ అన్నట్లే.