చిరంజీవి ముందు పేర్ని నానిగాడెంత?

మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖుల సమావేశం ముగిసింది. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సమావేశం ద్వారా సానుకూల ఫలితం వస్తుందని  భావిస్తున్నారు. ఈ దిశగా ఇటు సినీ ప్రముఖులు, అటు సీఎం జగన్ కూడా సంకేతాలు ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర కీలకం అనడంలో సందేహం లేదు.

టికెట్ల రేట్ల సమస్య పరిష్కారానికి ాయన అలుపెరగని పోరాటం చేశారు. తన స్థాయిని తగ్గించుకుని, అహాన్ని పక్కన పెట్టి సీఎం అపాయింట్మెంట్ కోసం మళ్లీ మళ్లీ ప్రయత్నించారు. మంత్రి పేర్ని నానితో సమావేశం కోసం కూడా ఆయన ఒక మామూలు వ్యక్తిలా ప్రయత్నం చేయడం గమనార్హం. ఈ విషయంలో చిరంజీవి ఎంత తగ్గి ఉన్నారన్నది స్వయంగా పేర్ని నానినే ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ వెల్లడించారు. సీఎం, సినీ ప్రముఖుల సమావేశం నేపథ్యంలో ఒక టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పేర్ని నాని ఫోన్ ద్వారా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన చిరు గురించి గొప్ప మాటలు మాట్లాడారు. ‘‘చిరంజీవి గారు నాతో ఎన్నిసార్లు మాట్లాడి ఉంటారో లెక్క లేదు. చిరంజీవి గారి స్థాయి ఏంటి.. పేర్ని నాని గాడి స్థాయి ఏంటి? నాతో ఎన్నిసార్లు మాట్లాడి ఉంటారనుకుంటున్నారాయన? చిన్న పిల్లాడి లాగా ఫోన్ చేసి నానీ నీకు నేను ఫోన్ చేయొచ్చా? ఎన్నింటికి చేయను? ఎన్నింటికి నాతో మాట్లాడటానికి నీకు ఖాళీ ఉంటుంది? చిరంజీవి సినిమాలకు ఆయన కటౌట్లకు దండలేసి.. ఆయన సినిమా టికెట్ల కోసం చొక్కాలు చించుకున్న వాళ్లం మేం.

అలాంటి మాకు చిరంజీవి గారు ఫోన్ చేసి నానీ నీతో ఎన్నింటికి మాట్లాడాలి అని అడిగారంటే ఏమనుకోవాలి. ఆ స్థాయిలో ఆయన ప్రయత్నం చేశారు. ఒక సమస్యను పరిష్కారం చేద్దామని ఆయననుకున్నారు. ఈ నానీగాడు బుడ్డోడా పెద్దోడా అని లేదు. ఆయనకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఇది చేశారు’’ అని నాని వివరించారు.