బాల‌య్య సెన్సేషనల్ రికార్డ్‌

ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ `ఆహా` వేధిక‌గా ప్ర‌సార‌మైన టాక్ షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ఈ షో ద్వారా తొలిసారి హోస్ట్‌గా మారి.. ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేశారు. మోహ‌న్ బాబు, నాని, ర‌వితేజ‌, రాజ‌మౌళి, అనిల్ రావిపూడి, బ్ర‌హ్మానందం, రానాతో స‌హా ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖులు ఈ షోలో పాల్గొని బాల‌య్య‌తో సంద‌డి చేశారు.

ఫిబ్ర‌వ‌రి 4న స్ట్రీమింగ్ అయిన‌ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎపిసోడ్‌తో ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 1 పూర్తి అయింది. తన‌దైన హోస్టింగ్‌తో మ‌రియు రెట్టింపు ఎన‌ర్జీతో బాల‌య్య‌ ఈ షోను సూప‌ర్ స‌క్సెస్ చేసి.. ఎన్నో రికార్డుల‌ను కొల్ల‌గొట్టారు. ఇక ఇప్పుడు ఈ టాక్ షో ద్వారానే బాల‌య్య మ‌రో సెన్సేషనల్ రికార్డ్‌ను సెట్ చేశారు.

తాజాగా అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే షో ఏకంగా 40 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాల‌ను సొంతం చేసుకుంది. ఫ‌లితంగా ఓటీటీ ఫ్లాట్ ఫాంలోనే అత్యధికంగా వీక్షించబడిన కార్యక్రమంగా ఆన్ స్టాప‌బుల్ షో రికార్డు క్రియేట్ చేసింది. దీంతో నంద‌మూరి అభిమానులు బాల‌య్య వ‌ల్లే అన్ స్టాప‌బుల్ ఘ‌న విజ‌యం సాధించింద‌ని తెగ మురిసిపోతున్నారు. మ‌రోవైపు బాలయ్యతో టాక్ షో ఏంట్రా బాబూ అన్న నోర్లే.. ఆయ‌న‌పై ప్రశంస‌లు కురిపిస్తున్నారు. అంతేకాదు, సీజ‌న్ 2 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.

కాగా, బాల‌య్య సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల `అఖండ‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడీయ‌న‌. డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఇక ప్ర‌స్తుతం బాల‌య్య గోపీచంద్ మ‌లినేనితో ఓ సినిమా చేస్తున్నాడు. శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం కొద్ది రోజుల క్రిత‌మే సెట్స్ మీద‌కు వెళ్లింది.