లత పాడిన ఆ తెలుగు పాటను మరువగలమా?


ఒక గాయనికి దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న దక్కిందంటే ఆమె దేశ ప్రజలకు తన పాటలతో ఎంత ఆనందాన్నిచ్చిందో.. కళకు ఆమె చేసిన సేవ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దేశంలో ఒక్క లతా మంగేష్కర్‌కు మాత్రమే దక్కిన గౌరవమిది. భాషా భేదం లేకుండా ఆమె పాటలను విని మైమరిచిపోయిన అభిమానులు కోట్లల్లోనే ఉన్నారు. ఏకంగా 35 భారతీయ భాషల్లో లత పాటలు పాడారంటే ఆమె ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఆమె పాడింది హిందీ పాటలు. వాటి గురించి అభిమానులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు.

వాటిలో ఏవి బాగుంటాయన్న చర్చ మొదలు పెడితే.. అది ఎంతకీ ఆగదు. తెలుగు పాడినవి చాలా తక్కువ పాటలే అయినా.. ప్రతిదీ చిర స్థాయిగా నిలిచిపోయేదే. ముఖ్యంగా ‘ఆఖరి పోరాటం’లో లత పాడిన పాటను తెలుగు ప్రేక్షకులు ఎన్నటికీ మరిచిపోలేరు.

మన గాన గంధర్వుడు ఎస్పీ బాలుతో కలిసి లత ‘ఆఖరి పోరాటం’లో తెల్లచీరకు అంటూ సాగే పాటను అద్భుతంగా ఆలపించారు. ఇళయరాజా మార్కు శ్రావ్యమైన ట్యూన్‌కు బాలు, లత కలిసి ప్రాణం పోశారు. లత గాత్రంలోని తియ్యదనానికి మన వాళ్లు ఫిదా అయిపోయారు. దశాబ్దాలుగా ఈ పాట తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ తరం శ్రోతలు విన్నా ఆ పాటకు ఫిదా అయిపోవాల్సిందే. తెలుగులో లతా జీ మరి కొన్ని పాటలు కూడా పాడారు.

1955లో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిని ‘సంతానం’ సినిమాలో నిదురపోరా తమ్ముడా అంటూ సాగే జోల పాట కూడా ఎవర్ గ్రీనే. అలాగే ఎన్టీఆర్-జమున జంటగా నటించిన ‘దొరికితే దొంగలు’ చిత్రంలో శ్రీ వేంకటేశా.. పాటను కూడా లత తనదైన శైలిలో ఆలపించారు. తెలుగులో తక్కువ పాటలే పాడినా.. ప్రతిదాంట్లోనూ లత తన ప్రత్యేకతను చాటుకున్నారు.