అవును.. బాలయ్య విలన్ అతనే

‘అఖండ’తో బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించాడు నందమూరి బాలకృష్ణ. కెరీర్లో ఈ స్థితిలో ఇలాంటి విజయం ఆయనతో సహా ఎవరూ ఊహించి ఉండరు. ఈ ఉత్సాహంలో బాలయ్య తన తర్వాతి చిత్రానికి రెడీ అయిపోయాడు. గత ఏడాది ‘అఖండ’ లాగే సెన్సేషనల్ హిట్టయిన ‘క్రాక్’ మూవీని తెరకెక్కించిన గోపీచంద్ మలినేనితో బాలయ్య జట్టు కట్టబోతున్న సంగతి తెలిసిందే. వీరి కలయికలో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సినిమా నిర్మించబోతోంది.

ఈ చిత్రానికి కథానాయికగా ఇప్పటికే శ్రుతి హాసన్ ఖరారైంది. ఇక బాలయ్యను ఢీకొట్టే విలన్ ఎవరన్నదే తెలియాల్సి ఉంది. కన్నడ నటుడు దునియా విజయ్ ఈ చిత్రంలో విలన్‌గా నటించబోతున్నట్లు ఇంతకుముందు వార్తలు రావడం తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తే ఖరారైంది. దునియా విజయ్‌ను బాలయ్య-గోపీచంద్ సినిమాలో విలన్‌గా ప్రకటించింది మైత్రీ మూవీ మేకర్స్.‘శుభలేఖ’ సినిమా సీనియర్ నటుడు సుధాకర్‌కు, ‘దిల్’ సినిమా రాజుకు ఇంటి పేర్లుగా మారినట్లే.. కన్నడలో ‘దునియా’ అనే సినిమా విజయ్‌కి ఇంటి పేరుగా మారింది.

అతను శాండిల్‌వుడ్‌లో మొదట చిన్న చిన్న పాత్రలే చేశాడు. అతను హీరోగా నటించిన ‘దునియా’ సూపర్ హిట్ కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తర్వాత వరుసగా సినిమాలు చేశాడు. అందులో చాలా వరకు ఊర మాస్ సినిమాలే. దాదాపు నలభై సినిమాల్లో నటించిన  విజయ్.. కొన్నేళ్ల ముందు ఒక దుర్ఘటనతో వార్తల్లో నిలిచాడు. అతను చేస్తున్న ఓ సినిమా కోసం ఒక చెరువులో యాక్షన్ సన్నివేశాలు తీస్తుండగా.. ఇద్దరు ఫైటర్లు నీళ్లలో మునిగి చనిపోయారు.

అప్పుడు విజయ్‌తో పాటు చిత్ర బృందం మీద పోలీసులు కేసు కూడా పెట్టారు. తర్వాత ఈ కేసు నుంచి అతను బయటపడ్డాడు. చూడ్డానికి చాలా రఫ్‌గా కనిపించే  దునియా విజయ్.. విలన్ పాత్రలకు బాగానే సూటవుతాడు. మరి కన్నడ ప్రభాకర్, దేవరాజ్, సుదీప్‌ల మాదిరే ఈ కన్నడ నటుడు తెలుగులో విలన్ పాత్రతో తనదైన ముద్ర వేస్తాడేమో చూడాలి.