రాధేశ్యామ్.. 18 ఏళ్ల క్రితమే మొదలైంది!

రాధేశ్యామ్.. కొత్త ఏడాదిలో రాబోయే భారీ చిత్రాల్లో ఒకటి. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాల మీద దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో ఆసక్తి ఉంటోందో తెలిసిందే. ఐతే ‘సాహో’ నిరాశ పరచడంతో ‘రాధేశ్యామ్’ మీద అంచనాలు కొంచెం తగ్గాయి. తన ఇమేజ్‌కు భిన్నంగా మాస్, యాక్షన్ అంశాలను పక్కన పెట్టి పక్కా ప్రేమకథ చేయడం కూడా ఈ సినిమాపై అంచనాలు తగ్గడానికి ఒక కారణం.

ఐతే సినిమా సక్సెస్ మీద చిత్ర బృందం అయితే చాలా ధీమాగా కనిపిస్తోంది. ఈ సినిమా కోసం ఐదారేళ్ల సమయాన్ని వెచ్చించిన రాధాకృష్ణ కుమార్ అయితే కచ్చితంగా హిట్ కొడతానని, తన శ్రమకు తగ్గ ఫలితం వస్తుందని ధీమాగా ఉన్నాడు. 2015లో ‘జిల్’ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన అతను.. మళ్లీ 2022లో ‘రాధేశ్యామ్’తో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఐతే ఈ సినిమాకు పునాది పడింది ఆరేళ్ల ముందు కూడా కాదని.. 18 ఏళ్ల క్రితం అని రాధాకృష్ణ వెల్లడించడం విశేషం.రాధాకృష్ణ కుమార్.. విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి శిష్యుడన్న సంగతి తెలిసిందే. ఈ కథకు సంబంధించి బేసిక్ పాయింట్ చెప్పింది కూడా యేలేటినేనట. 18 ఏళ్ల కిందట ఆయన ఆ పాయింట్ చెప్పగా.. ఆ తర్వాత చాలామంది ప్రముఖ రచయితలతో ఆ పాయింట్ డెవలప్ చేసే ప్రయత్నం చేశామని.. కానీ ఆ కథకు సరైన ముగింపు ఇవ్వడానికి మాత్రం ఎవరి వల్లా కాలేదని రాధాకృష్ణ చెప్పాడు.

ఇది జాతకాలతో ముడిపడ్డ కథ కావడంతో దీన్ని చేయాలని ఎవరికి రాసి పెట్టి ఉందో అని యేలేటి తన దగ్గర వ్యాఖ్యానించాడని.. చివరికి ప్రభాస్‌తో ఈ కథను చేసే అవకాశం వచ్చిందని అన్నాడు. ప్రభాస్‌తో సినిమా అన్నాక దాన్నొక ఛాలెంజ్ లాగా తీసుకుని ఎంతో కష్టపడి సినిమాకు క్లైమాక్స్ రాశానని.. స్క్రిప్టు పూర్తి చేశానని.. చివరికి నాలుగేళ్ల ముందు మొదలైన సినిమా ఇప్పుడిలా ప్రేక్షకుల ముందుకు వస్తోందని చెప్పాడు. ఈ చిత్రం కచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుందని రాధాకృష్ణ కుమార్ ధీమా వ్యక్తం చేశాడు.