బాలీవుడ్‌కు దడ పుట్టిస్తున్న టాలీవుడ్‌

బాలీవుడ్ కొన్నేళ్లుగా క్లాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. అక్కడ మాస్ మసాలా సినిమాలు బాగా తగ్గిపోయాయి. స్టార్ హీరోల్లో సైతం చాలామంది క్లాస్ టచ్ ఉన్న సినిమాలే చేస్తున్నారు. హీరోయిజం ఎలివేట్ అయ్యే, మాస్‌కు నచ్చే సినిమాలు అక్కడ పెద్దగా తెరకెక్కట్లేదు. సల్మాన్ ఖాన్ లాంటి వాళ్లు ఊర మాస్ సినిమాలు చేస్తున్నప్పటికీ.. వాటిలో ఏమాత్రం విషయం ఉండట్లేదు.

సౌత్‌లో మాదిరి హీరో ఎలివేషన్లు, మాస్ అంశాలు ఉంటూనే కథా బలం ఉన్న చిత్రాలు అక్కడ రావట్లేదు. దీని వల్ల ఉత్తరాది మాస్ ప్రేక్షకులు బాలీవుడ్‌తో క్రమ క్రమంగా డిస్కనెక్ట్ అయిపోతున్నారు. యూట్యూబ్‌లో, టీవీ ఛానెళ్లలో సౌత్ డబ్బింగ్ చిత్రాలకు అనూహ్యమైన ఆదరణ దక్కుతుండటానికి ఇదే కారణం. అల్లు అర్జున్ సహా చాలామంది సౌత్ స్టార్లు ఈ డబ్బింగ్ సినిమాల ద్వారానే ఉత్తరాదిన స్టార్ ఇమేజ్ సంపాదించడం విశేషం.

బాహుబలి, కేజీఎఫ్, సాహో లాంటి సౌత్ సినిమాలు ఉత్తరాదిన ఎలా వసూళ్ల వర్షం కురిపించాయో తెలిసిందే. ఇప్పుడు ‘పుష్ప’ సైతం అంచనాల్ని మించి అదరగొడుతోంది. ఈ సినిమాను ముందుగా బాలీవుడ్ ట్రేడ్ పండిట్లు తక్కువ అంచనా వేశారు. యూట్యూబ్ ఫాలోయింగ్ ఇక్కడ వర్కవుట్ కాదని తీర్మానాలు చేశారు. కానీ తీరా చూస్తే ‘పుష్ఫ’ బాలీవుడ్ ట్రేడ్ పండిట్లు అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ సినిమా వసూళ్లు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తొలి రోజు రూ.3 కోట్ల పైచిలుకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ చిత్రం వీక్ డేస్‌లో అదరగొట్టేస్తుండటం విశేషం.

సోమవారం, మంగళవారం రెండు రోజుల్లోనూ రూ.4 కోట్ల ప్లస్ గ్రాస్ కలెక్ట్ చేసింది ‘పుష్ప’ హిందీ వెర్షన్. దీని గురించి ఆశ్చర్యపోతూ ట్వీట్లు వేశాడు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్. ‘పుష్ఫ’ వసూళ్లు చూసి కచ్చితంగా బాలీవుడ్ జనాల లోలోన కంగారు పుడుతూ ఉంటుందనడంలో సందేహం లేదు. సౌత్ సినిమాలు ఇలా ఆధిపత్యం చలాయిస్తూ నార్త్ మాస్ ప్రేక్షకులను తమ వైపు తిప్పుకుంటే తమ మనుగడకే ప్రమాదం వస్తుందన్న ఆందోళన వారిలో కలగకుండా ఉండదు. కానీ అక్కడి మాస్‌ను మన సౌత్ డైరెక్టర్లలాగా మెస్మరైజ్ చేసే దర్శకులే కనిపించకపోవడమే పెద్ద సమస్య.