దిల్ రాజులో ‘మండే’ భయం

ఈ ఏడాది ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటైన ‘పుష్ప’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ తొలి రోజుకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జరగడంతో వసూళ్లకు ఢోకా లేకపోయింది. నైజాం ఏరియాలో రూ.11 కోట్లకు పైగా షేర్‌తో ఆల్ టైం నాన్-బాహుబలి రికార్డును నెలకొల్పింది ‘పుష్ప’. ఇది మరీ ఆశ్చర్యపడాల్సిన విషయమేమీ కాదు. ఎందుకంటే ఈ సినిమాను రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ చేశారు. పైగా టికెట్ల రేట్లు కూడా పెంచారు.

గతంలో సింగిల్ స్క్రీన్లలో రూ.100-120గా ఉన్న రేట్లను రూ.150కి.. మల్టీప్లెక్సుల్లో 150గా ఉన్న ధరను 200కు పెంచేవాళ్లు. కానీ ‘పుష్ప’కు మాత్రం దాదాపు 75 శాతం రేట్లు పెంచేశారు నైజాం ఏరియాలో. సింగిల్ స్క్రీన్లలో మినిమం రేటు రూ.200 కాగా.. మల్టీప్లెక్సుల్లో రేటు రూ.`250 నుంచి మొదలైంది. ఈ స్థాయిలో రేట్లు పెంచి హౌస్ ఫుల్స్ పడితే కొత్త రికార్డులు నమోదు కాకుండా ఎలా ఉంటాయి?

ఐతే తొలి వీకెండ్ వరకు రేట్ల పెంపుతో డిస్ట్రిబ్యూటర్‌కు చాలా ప్రయోజనమే చేకూరనుంది కానీ.. ఆ తర్వాత ఈ పెంపే శాపంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. సినిమాకు హిట్ టాక్ వస్తే ప్రేక్షకులు రేటు ఎక్కువైనా వెనుకాడరు. కానీ టాక్ అటు ఇటుగా ఉంటే మాత్రం రేట్ల పెంపు ప్రతికూల ప్రభావం చూపుతుంది. మెజారిటీ ప్రేక్షకులు బాలేదంటున్న సినిమాను అంత రేటు పెట్టి థియేటర్లకు వెళ్లి చూడాలా అన్న ప్రశ్న మొదలవుతుంది. ‘పుష్ప’ విషయంలో ఇదే జరుగుతుందేమో అన్న భయాలు కలుగుతున్నాయి. వీకెండ్ వరకు ఓకే కానీ.. సోమవారం సినిమా నిలబడ్డం కష్టమే అంటున్నారు.

టికెట్ల రేట్ల పెంపు చాలా ప్రభావం చూపుతుందని.. ఫుట్ ఫాల్స్, కలెక్షన్లు ఒక్కసారిగా పడిపోతాయని అంచనా వేస్తున్నారు. అలాగని ఆదివారం తర్వాత రేట్లు తగ్గిస్తే సినిమా ఫ్లాప్ కాబట్టే తగ్గించారనే సంకేతాలు కూడా వెళ్తాయి. ఈ నేపథ్యంలో నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఏం చేయబోతున్నాడన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆయన ఈ చిత్రంపై ఏకంగా రూ.35 కోట్లు పెట్టుబడి పెట్టి నైజాంలో రిలీజ్ చేశారు. తొలి రోజుకు హౌస్ ఫుల్స్, కలెక్షన్లు చూసి ఆయన సంబరపడి ఉంటారు కానీ.. వీకెండ్ తర్వాత ఏం జరుగుతుందో అన్న భయం ఆయన్ని కంగారు పెడుతూ ఉంటుందనడంలో సందేహం లేదు.