సూర్య చేసిన ఒకే ఒక తప్పు

‘జై భీమ్’ సినిమాతో సూర్య మీద ఏ స్థాయిలో ప్రశంసలు కురుస్తున్నాయో తెలిసిందే. ఈ సినిమా ఒక మాస్టర్ పీస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 90వ దశకంలో జరిగిన ఒక దారుణమైన లాకప్‌డెత్ ఆధారంగా ఈ సినిమాను తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే. సూర్య ఇందులో చంద్రు అనే ప్రధాన పాత్రను పోషించడంతో పాటు తన 2డీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించాడు. జ్ఞానవేల్ అనే యువ దర్శకుడు ‘జై భీమ్’ను రూపొందించాడు.

ఇలాంటి సినిమాకు నటుడిగా, నిర్మాతగా అండగా నిలవడం పట్ల సూర్యపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఐతే ఈ సినిమా విషయంలో కొన్ని వివాదాలు సూర్యను చుట్టుముట్టడం తెలిసిందే. వన్నియార్ అనే కులాన్ని కించపరిచేలా ఓ సన్నివేశం ఉందని ఆ కులస్థులు సూర్యను వివాదంలోకి లాగడమే కాక.. క్షమాపణ డిమాండ్ చేశారు. ఈ విషయంలో సూర్యకు అన్ని వైపుల నుంచి మద్దతు లభించింది. ఇందులో సూర్య తప్పేమీ లేదని అందరూ వాదించారు. పైగా సూర్య ఆ సన్నివేశాన్ని సినిమా నుంచి తీయించడంతో అతడికి మరింత మద్దతు లభించింది.

ఐతే ఈ విషయంలో సూర్య తప్పు లేదనిపించినా.. మరో విషయంలో మాత్రం అతడికి విమర్శలు తప్పట్లేదు. లాకప్ డెత్ కేసుకు సంబంధించి తమిళంలో చాలా వరకు నిజ జీవిత పాత్రల పేర్లనే సినిమాలోనూ పెట్టారు. చంద్రు అని లాయర్‌గా, జడ్జిగా బాగా పాపులర్ అయిన వ్యక్తి పాత్రనే సూర్య చేశాడు. అదే పేరును కొనసాగించారు. అలాగే లాకప్ డెత్ బాధితుడిగా రాజా కన్ను, అతడి భార్యగా సెంగిని పేర్లను కూడా సినిమాలో కొనసాగించారు. కానీ రాజా కన్నుతో పాటు మరో ఇద్దరి పట్ల కిరాతకంగా వ్యవహరించి ఈ లాకప్ డెత్‌కు కారణమైన వ్యక్తి పేరును మాత్రం సూర్య టీం మార్చేసింది.

ఒరిజినల్‌గా ఆ వ్యక్తి ఆంటోనీ స్వామి అనే క్రిస్టియన్ కాగా.. సినిమాలో మాత్రం ‘గురుమూర్తి’ అనే హిందువు పేరు పెట్టారు. మిగతా పాత్రలను యథాతథంగా కొనసాగించి.. క్రిస్టియన్ పేరును మాత్రం హిందూ పేరుగా మార్చడంలో సూర్య అండ్ కో ఉద్దేశం ఏంటి అంటూ హిందూ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో సూర్య సమర్థించుకోవడానికి కూడా ఏమీ లేకపోవడంతో సైలెంటుగా ఉన్నాడు.