ఫిల్మ్ ఫెస్టివల్‌కి సమంత.. జోరు తగ్గలా!

విడాకుల గురించి అనౌన్స్ చేయగానే అందరూ సమంత మీద విరుచుకు పడిపోయారు. అలా చేసింది, ఇలా చేసింది, ఇది కరెక్టా, అది కరెక్టా అంటూ చర్చల మీద చర్చలు నడిపారు. నన్ను ఒంటరిగా వదిలేయండి అని ఆమె బతిమాలినా పట్టించుకోలేదు. ఇక తనకి ఫ్యూచరే లేదన్నట్టు మాట్లాడినవాళ్లూ ఉన్నారు. వాళ్లందరికీ సమంత తన వర్క్‌తో సమాధానం చెప్తోంది. తన క్రేజ్‌తో, ఇమేజ్‌తో ఇక మాట్లాడే చాన్స్ లేకుండా చేస్తోంది.

ప్రస్తుతం సమంత చేతిలో శాకుంతలం, కాత్తువాక్కుల రెండు కాదల్ చిత్రాలతో పాటు మరికొన్ని మూవీస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ దసరాకి ఓ సినిమాని అనౌన్స్ చేశారు. మిగతావి ప్రకటించాల్సి ఉంది. బాలీవుడ్‌లో తాప్సీ ప్రొడక్షన్‌లో ఓ మూవీ చేయబోతోందని సమాచారం. ఓ వెబ్‌ సిరీస్‌కి కమిటయ్యిందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇవన్నీ చూస్తేనే అర్థమవుతుంది.. వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఒడిదుడుకులు ఆమె స్పీడ్‌ని ఏమాత్రం తగ్గించలేదని. ఇక ఇప్పుడు సమంతకి ఓ అరుదైన గౌరవం కూడా దక్కింది.

గోవాలో జరిగే ఇండియన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌కి సమంతకు ప్రత్యేక ఆహ్వానం అందింది. అక్కడ ఆమెను ప్రసంగించాల్సిందిగా నిర్వాహకులు కోరారు. డైరెక్టర్ అరుణ్‌ రాజ, నటుడు జాన్, డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, వెర్సటైల్ యాక్టర్ మనోజ్‌ బాజ్‌పేయి లాంటి వారితో పాటు సమంతని కూడా స్పెషల్ స్పీకర్‌‌గా ఇన్వైట్ చేశారు. సౌత్‌ ఇండియా నుంచి ఓ నటికి ఈ అవకాశం రావడం ఇదే తొలిసారి. దాన్నిబట్టి సమంత ఏ స్థాయిలో ఇమేజ్‌ సంపాదించిందో తెలుస్తోంది.

అయితే కేవలం నటిగానే కాక, సామాజిక సేవా కార్యక్తర్తగా కూడా గుర్తించి సమంతను ఆహ్వానించారట. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సోషల్‌ సర్వీస్‌పై కూడా దృష్టి పెట్టింది సామ్. ఎంతోమందికి సాయపడింది. ఎన్నో స్వచ్ఛంద సంస్థలకి విరాళాలు ఇచ్చింది. మంచి నటే కాదు, మనసున్న మనిషి అని కూడా అనిపించుకుంది. అందుకే ఇప్పుడామెకి ఇంత గౌరవం దక్కుతోంది అంటున్నారంతా.