సింగరాయ్‌గారి దీపావళి దివ్వెలు

హీరోగారు ఎంత స్టామినా ఉన్నవారైతేనేం.. హీరోయిన్‌ గ్లామర్‌‌ యాడ్ అవ్వకపోతే బొమ్మ డల్లే. అందుకే ఏ హీరో పక్కనైనా ఓ అందాల అతివ ఉండాల్సిందే. అయితే శ్యామ్‌ సింగ రాయ్‌కి ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలు సెట్టయ్యారు. ఆ ముగ్గురూ దీపావళికి ప్రేక్షకుల ముందు ప్రత్యక్షమయ్యారు.

నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీలో సాయిపల్లవి, కృతీశెట్టి, మడొన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సాయిపల్లవి లుక్‌ని ఓసారి పరిచయం చేశారు. ఇప్పుడు మిగతా ఇద్దరు హీరోయిన్ల లుక్‌నీ రివీల్ చేశారు. దీపాల పండక్కి ప్రేక్షకులకి కనువిందు చేశారు.

సాయిపల్లవి అచ్చమైన బెంగాలీ భామలా కనిపిస్తోంది. అదే కట్టూ బొట్టూ. చేతిలో హారతి పళ్లెం. చూడటానికి రెండు కళ్లూ చాలవన్నట్టు చూడముచ్చటగా ఉంది. ఇక కృతీశెట్టి మోడర్న్ గాళ్‌గా మురిపిస్తోంది. స్టైలిష్ డ్రెస్.. డిఫరెంట్ హెయిర్‌‌ స్టైల్‌తో ‘ఉప్పెన’లో బేబమ్మకి పూర్తి భిన్నంగా ఉంది. మడొన్నా సెబాస్టియన్‌ది కాస్త సీరియస్ రోల్ అనిపిస్తోంది. ఆమె తయారైన విధానం సింపుల్‌గా ఉంది. కానీ చూపులు మాత్రం చాలా తీక్షణంగా ఉన్నాయి.

టోటల్‌గా ముగ్గురమ్మాయిలూ తమ లుక్‌తో మెప్పిస్తున్నారు. అయితే ఎవరి పాత్ర ఏంటనేది ఏమాత్రం ఎవరి ఊహకీ అందకుండా జాగ్రత్త పడ్డారు. మూవీ డిసెంబర్‌‌ 24న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో ఒక్కో అప్‌డేట్‌నీ వదులుతూ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచే ప్రయత్నం చేస్తోంది టీమ్. సింగిల్స్, టీజర్స్, ట్రైలర్‌‌ అన్నీ వరుసగా రాబోతున్నాయి. ఇక నాని ఫ్యాన్స్‌కి పండగే.