పీఆర్వోలతో బన్నీ సీక్రెట్ మీటింగ్

టాలీవుడ్లోనే కాదు.. ఇండియా మొత్తంలో పీఆర్ ప్లానింగ్‌లో అల్లు అర్జున్‌ను మించిన వాళ్లు లేరని అంటారు ఇండస్ట్రీ జనాలు. సరైన సినిమాల ఎంపికలో తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడం ద్వారా వేరే స్టార్లతో పోలిస్తే మంచి సక్సెస్ రేట్‌తో సాగుతున్న అతను.. తన సినిమాలను ప్రమోట్ చేసే విషయంలోనూ పక్కా ప్లానింగ్‌తో ఉంటాడు.

చాలా వరకు సక్సెస్ ఫుల్ సినిమాలు చేయడమే కాదు.. ఆ సినిమాలను సరిగ్గా ప్రమోట్ చేసి బాక్సాఫీస్ దగ్గర బెస్ట్ రిజల్ట్ తీసుకురావడంలో.. అలాగే ఆ సక్సెస్‌లో మేజర్ క్రెడిట్ తన ఖాతాలో చేరేలా, తన ఇమేజ్ పెరిగేలా పబ్లిసిటీ చేసుకోవడంలోనూ బన్నీ తనకు తానే సాటి అనిపిస్తుంటాడు.

కొన్నేళ్ల నుంచి స్టార్ హీరోలు వ్యక్తిగతంగా తమ కోసమే ఒక పీఆర్వోలను మెయింటైన్ చేస్తుండటం తెలిసిందే. టాలీవుడ్లో ఈ ట్రెండ్ మొదలుపెట్టిందే బన్నీ. ఐతే మిగతా వాళ్లు కూడా తనను అనుసరిస్తున్న టైంలో అతను ఇంకో అడుగు ముందుకేశాడు. ముగ్గురు నలుగురు పీఆర్వోలతో ఒక టీంనే మెయింటైన్ చేస్తున్నాడు. వీళ్లంతా కలిసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫ్యాన్ గ్రూప్స్ నడుపుతూ.. అలాగే ఇండియాలో ఉన్న ప్రముఖ పీఆర్వోలందరితో కనెక్ట్ అయి ఉంటూ బన్నీ వ్యక్తిగత ఇమేజ్‌ను ఎప్పటికప్పుడు పెంచే ప్రయత్నం చేస్తుంటారు. బన్నీ కొత్త సినిమా ‘పుష్ప’ ముంగిట ఈ రకమైన ప్రమోషన్ బాగా ఎక్కువైంది. అందుక్కారణం.. బన్నీ తొలిసారిగా తన చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తుండటమే.

రాజమౌళితో ‘బాహుబలి’ లాంటి సినిమా చేయకుండానే.. ‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్ అయిపోవాలని చూస్తున్న బన్నీ.. సినిమాలో ఉన్న కంటెంట్‌కు తోడు పీఆర్ బలాన్ని కూడా నమ్ముకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ‘పుష్ప’ను పాన్ ఇండియా లెవెల్లో బాగానే ప్రమోట్ చేస్తున్నప్పటికీ.. రిలీజ్ ముంగిట ప్రమోషన్ ఇంకా పెంచాలన్న ఉద్దేశంతో బాలీవుడ్, కోలీవుడ్ సహా వివిధ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ పీఆర్వోలతో సమావేశం అయినట్లు సమాచారం.

ఇందుకు ‘పుష్ప’ షూటింగ్ జరుగుతున్న రామోజీ ఫిలిం సిటీనే వేదిక అయింది. పీఆర్వోలందరికీ సొంతంగా ఫ్లైట్ టికెట్లు వేయించి రప్పించి.. రిలీజ్ ముంగిట ‘పుష్ప’ పీఆర్ ప్లానింగ్ గురించి బన్నీ చర్చించాడట. వాళ్లతో కొన్ని డీల్స్ కూడా జరిగాయని.. ‘పుష్ప’ ప్రి రిలీజ్ ప్రమోషన్లు పాన్ ఇండియా లెవెల్లో ఒక రేంజ్‌లో ఉండబోతున్నాయని సమాచారం.