శంకర్‌‌కి లైన్ క్లియర్

సినిమాలతో దేశం మొత్తాన్నీ తనవైపు తిప్పుకునే శంకర్.. ఇండియన్ కారణంగా వివాదాలతో వార్తల్లోకెక్కాడు. ఆ సినిమా విషయంలో శంకర్‌‌కి, నిర్మాణ సంస్థ లైకాకి మధ్య సమస్యలు తలెత్తాయి. విషయం కోర్టు మెట్లెక్కింది. దాంతో ఆ సినిమా భవిష్యత్తు అగమ్యగోచరం అయ్యింది. కానీ ఇప్పుడా సమస్య తీరిపోయిందట. శంకర్‌‌, లైకాల మధ్య రాజీ కుదిరినట్లు తెలుస్తోంది.

ఇండియన్‌ 2 సెట్‌లో యాక్సిడెంట్ అయ్యి కొందరు చనిపోవడంతో సినిమాకి బ్రేక్ పడింది. కేసులు, కోర్టులంటూ మూవీ ఆలస్యమవుతూ వచ్చింది. ఈలోపు శంకర్‌‌ ‘అపరిచితుడు’ హిందీ రీమేక్‌ని అనౌన్స్ చేయడంతో అలా ఎలా కుదురుతుంది, ముందు తమ సినిమాని పూర్తి చేయమంటూ నిర్మాణ సంస్థ లైకా గొడవకు దిగింది. కానీ శంకర్ తగ్గలేదు. సినిమా లేటవడానికి తాను కారణం కాదని, నిర్మాతలదే బాధ్యతని అన్నాడు. ఆ సమస్య తేలకముందే రామ్‌చరణ్‌తో కూడా మూవీని అనౌన్స్ చేశాడు. త్వరలో సెట్స్‌కి తీసుకెళ్లబోతున్నాడు కూడా.

దాంతో లైకా సంస్థ మరింత పట్టుబట్టింది. తమ సినిమాని పూర్తి చేశాకే మిగతా సినిమాలు చేయాలని మొండికేసింది. కమల్ హాసన్ స్వయంగా కల్పించుకున్నా శంకర్‌‌కి, లైకాకి మధ్య సమన్వయం కుదరలేదు. అయితే రీసెంట్‌గా జరిగిన హియరింగ్‌లో కోర్టు ఓ సలహా ఇచ్చింది. ఇరు వర్గాల వైపు సాక్ష్యాలు బలంగానే ఉన్నాయని, దీన్ని రచ్చ చేసుకోకుండా ఓ ఒప్పందానికి వస్తే మంచిదని చెప్పింది. అంటే మీ గొడవ మీరే తేల్చుకోండి అని చెప్పిందన్నమాట.

న్యాయస్థానమే అలా చెప్పాక ఇక చేసేదేముంది.. శంకర్‌‌తో లైకా ఒప్పందం చేసుకోడానికి ముందుకొచ్చింది. వీలైనంత త్వరగా ఆ రెండు సినిమాలూ కంప్లీట్ చేసి, తమ సినిమాని తిరిగి సెట్స్‌కి తీసుకెళ్లాలని.. ఎక్కువ లేట్‌ చేయకుండా మూవీని పూర్తి చేసెయ్యాలని చెప్పిందట. తాను కూడా మొదట్నుంచీ అదే చెబుతున్నానని, ఆ రెండూ అయ్యాక ఈ సినిమాని పూర్తి చేయడానికి నాకేం అభ్యంతరం లేదని శంకర్ కూడా అన్నాడట. దాంతో ఇండియన్‌ 2 వివాదానికి తెర పడినట్టేనని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.