ఆ సినిమా తర్వాత పవన్ బ్రేక్?

2018 జనవరిలో విడుదలైన ‘అజ్ఞాతవాసి’ తర్వాత పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి సినిమాలకు టాటా చెప్పేశాడు. అందుక్కారణం జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దిగడమే అన్న సంగతి తెలిసిందే. ఆ టైంలో తాను సినిమాలకు పూర్తిగా దూరమైనట్లే అని, మళ్లీ సినిమాలు చేయనని ప్రకటించాడు పవన్. ఈ మాట అభిమానులకు ఎంతమాత్రం రుచించలేదు. పవన్ మళ్లీ సినిమాలు చేయాలని చాలా గట్టిగా కోరుకున్నారు ఫ్యాన్స్. రెండేళ్ల తర్వాత వారి కోరిక ఫలించింది. 2019 ఎన్నికల తర్వాత కూడా కొన్ని నెలలు సినిమాలకు దూరంగా ఉన్న పవన్.. ఆ ఏడాది చివర్లో పునరాగమనానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.

‘వకీల్ సాబ్’తో రీఎంట్రీ ఇచ్చాడు. ఆర్థికంగా తాను, తన పార్టీ బలంగా ఉండాలంటే సినిమాలు చేయక తప్పదని, అలాగే అభిమానులతో కనెక్ట్ అయి ఉండటానికి కూడా సినిమాలు ఓ మార్గమని భావించి పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

‘వకీల్ సాబ్’తో పాటు ఇంకో మూడు చిత్రాలకు పవన్ కమిట్మెంట్ ఇవ్వడం.. ఒకదాని తర్వాత ఒకటి లైన్లో పెట్టడం తెలిసిందే. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’తో పాటు ‘భీమ్లానాయక్’ సినిమాలో నటిస్తున్నాడు పవన్. దీని తర్వాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలు రెడీగా ఉన్నాయి. ఐతే వీటి తర్వాత పవన్ కొత్తగా సినిమాలు ఒప్పుకునే అవకాశం లేదని సమాచారం. భగవాన్, పుల్లారావులతో పాటు కొందరు నిర్మాతలు పవన్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు కానీ.. ఎవ్వరికీ పవన్ హామీ ఇవ్వట్లేదట.

ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయడానికే ఇంకో ఏడాదికి పైగా సమయం పట్టేలా ఉంది. ఇంకో సినిమా ఒప్పుకుంటే 2024 ఎన్నికలకు సన్నద్ధం కావడం కష్టమవుతుందని పవన్ భావిస్తున్నాడట. అసలు హరీష్ శంకర్ సినిమా పూర్తి చేసి సురేందర్ సినిమాను హోల్డ్‌లో పెట్టే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. ఇప్పటికే పవన్ రాజకీయాల్లో దూకుడు పెంచి, సినిమాలతో సమానంగా పొలిటికల్ కార్యక్రమాలకు సమయం కేటాయిస్తున్నాడు.

త్వరలోనే పవన్ తన మకాంను విజయవాడకు మార్చబోతున్నాడని.. మరింతగా పార్టీకి సమయం ఇవ్వబోతున్నాడని కూడా అంటున్నారు. అక్కడి నుంచి షూటింగ్స్ కూడా హైదరాబాద్‌కు వచ్చి వెళ్తుంటాడని.. ఔట్ డోర్ షూటింగ్స్ ఉంటే విజయవాడలో చేసుకునే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నాడట. సాధ్యమైనంత త్వరగా చేతిలో ఉన్న ప్రాజెక్టుల్ని పూర్తి చేసి 2023 ఆరంభంలో పవన్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకోబోబోతున్నట్లుగా తెలుస్తోంది.