‘మా’ ఎన్నికల్లో ట్విస్టులు ఆగట్లేదు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ముగిసి వారం కావస్తోంది. కానీ ఈ ఎన్నికల రగడ ఇంకా ఆగట్లేదు. ఎన్నికల అనంతరం ప్రకాష్ రాజ్ ప్యానెల్ అనేక విమర్శలు, ఆరోపణలు చేయడం.. తమ పదవులకు రాజీనామా చేయడం తెలిసిందే. దీనిపై మంచు విష్ణు ప్యానెల్ నుంచి తీవ్ర స్పందనేమీ లేదు. సాధ్యమైనంత సైలెంటుగా ఉంటూ ముందుకు వెళ్లిపోదామనే ఆలోచనతో ఉన్నట్లుగా కనిపిస్తోంది.

ఐతే ఎన్నికల నిర్వహించిన తీరుపై ఇంతకుముందే అభ్యంతరాలు వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్.. అంతటితో ఆగకుండా ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రం లోపల తమ ప్యానెల్ సభ్యులపై దాడి జరిగిందని.. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కావాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ను కోరుతూ లేఖ రాయడం తెలిసిందే. ఐతే ప్రకాష్ రాజ్ విజ్ఞప్తిని కృష్ణమోహన్ తిరస్కరించారు. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి ఆయన నిరాకరించినట్లు వార్తలొస్తున్నాయి.

ఐతే ఈ లోపు ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. హైదరాబాద్ పోలీసులు ఇందులో జోక్యం చేసుకున్నారు. ఎన్నికలు జరిగిన జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్లో సీసీటీవీ ఫుటేజ్ ఉన్న గదిని సీజ్ చేశారు. పోలీసులు స్వచ్ఛందంగా ఈ పని చేసే అవకాశం లేదు. బహుశా సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి ఎన్నికల అధికారి నిరాకరించిన నేపథ్యంలో.. ప్రకాష్ రాజ్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటాడని.. దీంతో వారు రంగంలోకి దిగి ఈ గదికి తాళం వేసి ఉంటారని భావిస్తున్నారు.

మరి ఈ వ్యవహారంలో తర్వాత ఏం జరుగుతుందన్నది ఆసక్తికరం. ఎన్నికల సందర్భంగా అంతా సవ్యంగా సాగి ఉంటే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడంలో ఎన్నికల అధికారికి ఉన్న అభ్యంతరమేంటన్నది ప్రశ్న. ప్రకాష్ రాజ్ అయితే ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేలా కనిపించడం లేదు. అవసరమైతే కోర్టుకు వెల్లడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.