మహేష్ రేసులోనే ఉన్నాడబ్బా

సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ఖరారై ఉండగా.. ఉన్నట్లుండి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని కూడా పండక్కి కొన్ని రోజుల ముందు రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయింది దాని టీం. జనవరి 12 నుంచి వరుసగా మూడు రోజులు పవన్ కళ్యాణ్ సినిమా ‘భీమ్లా నాయక్’, మహేష్ బాబు చిత్రం ‘సర్కారు వారి పాట’, ప్రభాస్ మూవీ ‘రాధేశ్యామ్’ షెడ్యూల్ అయి ఉండగా.. 7న ‘ఆర్ఆర్ఆర్’ను రిలీజ్ చేయడమేంటి అనే ప్రశ్నలు తలెత్తాయి. పై మూడు చిత్రాలకే థియేటర్లు సర్దుబాటు చేయడం చాలా కష్టం. దీని వల్ల ప్రతి సినిమా వసూళ్ల మీదా ప్రభావం పడుతుంది.
అలాంటిది ఇక ‘ఆర్ఆర్ఆర్’ 7న వస్తే అంతే సంగతులు. థియేటర్లు దొరకవు. దేనికీ వసూళ్లు ఆశించిన స్థాయిలో రావు. ఐతే ‘రాధేశ్యామ్’ పక్కాగా 14నే వస్తుందని.. భీమ్లా నాయక్, సర్కారు వారి పాట అనుకున్న ప్రకారం రిలీజ్ కావడం డౌటే అని ఈ మధ్య గుసగుసలు వినిపించాయి.

ముఖ్యంగా ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ఎలాగూ ఆలస్యమవుతుండటంతో దీన్ని వేసవికి వాయిదా వేశారనే ప్రచారం జోరుగానే సాగింది. మహేష్ ఫ్యాన్స్ కూడా మానసికంగా ఇందుకు సిద్ధమైపోయారు. కానీ ఇప్పుడు చిత్ర బృందం ట్విస్ట్ ఇచ్చింది. సంక్రాంతికే తమ సినిమా వస్తుందని ధ్రువీకరించింది.

ఆదివారం హీరోయిన్ కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా ఒక పోస్టర్‌తో పాటు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది ‘సర్కారు వారి పాట’ టీం. ఇందులో తమ చిత్రం జనవరి 13నే విడుదల కాబోతున్నట్లు ప్రకటించింది. కీర్తికి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే విషయం అక్కడికే పరిమితం కావాలి. కానీ పర్టికులర్‌గా రిలీజ్ డేట్ గురించి ప్రస్తావించారంటే తమ సినిమా వాయిదా పడట్లేదని, జరుగుతున్న ప్రచారాలన్నీ అబద్ధమని సంకేతాలు ఇవ్వడానికే కావచ్చు. మరోవైపు ‘భీమ్లా నాయక్’ టీం సైతం 12నే తమ చిత్రం పక్కా అంటున్న నేపథ్యంలో వారం వ్యవధిలో నాలుగు భారీ చిత్రాలను అకామొడేట్ చేసే స్పేస్ ఎక్కడుందన్నది ప్రశ్న.