సిద్ధు కొల్లగొట్టేశాడబ్బా..

త్వరలోనే తెలుగులో మరో మల్టీస్టారర్ మూవీ చూడబోతున్నాం. శర్వానంద్, సిద్దార్థ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘మహాసముద్రం’ ఈ గురువారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సంచలనం రేపిన యువ దర్శకుడు అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన రెండో చిత్రమిది. మామూలుగా చూస్తే శర్వా, సిద్ధులది ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ పరంగా సమాన స్థాయే.

కాకపోతే సిద్ధు చివరగా తెలుగులో చేసిన కొన్ని సినిమాలు నిరాశ పరిచాయి. చాలా ఏళ్ల నుంచి సిద్ధు తెలుగులో సినిమా చేయకపోవడం అతడికి మైనస్. కానీ ఒక దశలో అయితే శర్వాను మించిన ఇమేజ్ అతడి సొంతం. యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉండేదతడికి. కానీ సరైన సినిమాలు ఎంచుకోక అతను ఆ క్రేజ్‌ను, మార్కెట్‌ను దెబ్బ తీసుకున్నాడు. ఇక తెలుగులో మళ్లీ కనిపించడేమో అనుకున్నవాడు.. చాలా గ్యాప్ తర్వాత తనకు నచ్చిన కథతో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు.

ఐతే శర్వా, సిద్ధు నటించారు కాబట్టి ఇది ఇద్దరు హీరోల సినిమా అని, మల్టీస్టారర్ అనే అందరూ అనుకుంటుంటే.. సిద్ధు మాత్రం ఇది మల్టీస్టారర్ కాదు అంటుండటం విశేషం. ఎవరేమి అనుకున్నా కానీ.. తన దృష్టిలో మాత్రం ‘మహాసముద్రం’ శర్వా సినిమా అని.. ఎప్పటికీ దీన్ని అలాగే చూస్తానని సిద్ధు అన్నాడు. తాను కేవలం అతడి పక్కన నిలబడ్డానని, అందుకు తాను గర్విస్తానని చెప్పాడు. శర్వా వల్లే ఈ సినిమాకు ఇంత క్రేజ్ వచ్చిందని, అతడి వల్లే ఇదొక మాస్ సినిమాగా మారి ఇంత మందికి రీచ్ అవుతోందని సిద్ధు పేర్కొనడం విశేషం.

మామూలుగా సిద్ధు యాటిట్యూడ్ గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో, మీడియా ముందుకు వచ్చినపుడు కొంచెం పొగరుగానే మాట్లాడుతుంటాడు. వివాదాస్పద కామెంట్లు చేస్తుంటాడు. అలాంటివాడు ‘మహాసముద్రం’ మల్టీస్టారర్ కాదని, ఇది శర్వా సినిమా అని పేర్కొనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంత ఓపెన్ మైండ్‌తో ఆలోచించి ఆ కామెంట్ చేయడం ద్వారా సిద్ధు అందరి మనసులూ కొల్లగొట్టేశాడు. దీంతో పాటు తెలుగు ప్రేక్షకులతో తన అనుబంధం గురించి అతను చెప్పిన మాటలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి.