అక్క‌డ స్పేస్ లేదు.. కానీ క్రిష్ తీసుకున్నాడు

ఇంకో మూడు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘కొండపొలం’ సినిమా. టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడైన క్రిష్ రూపొందించిన చిత్రమిది. ఓవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’ లాంటి భారీ చిత్రాన్ని రూపొందిస్తూ.. మధ్యలో దొరికిన కొంచెం ఖాళీలో చాలా తక్కువ రోజుల్లో, తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను లాగించేశాడు క్రిష్. ఈ సినిమాకు కథ సొంతంగా రాసుకోవాల్సిన అవసరం క్రిష్‌కు రాలేదు. ఇది ‘కొండపొలం’ పేరుతోనే ప్రముఖ రాయలసీమ రచయిత సన్నపురెడ్డి వెంకటరెడ్డి రాసిన పుస్తకం ఆధారంగా క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించాడు.

ట్రైలర్ చూస్తే.. దాదాపుగా పుస్తకాన్ని అనుసరించే సినిమా తీసినట్లుగా ఉంది. కానీ పుస్తకంలో హీరోయిన్ పాత్ర ఉండదు. ఓబులమ్మ పేరుతో రకుల్ ప్రీత్ చేసిన పాత్ర సినిమా కోసం ప్రత్యేకంగా సృష్టించిందట. ఈ పుస్తకానికి సంబంధించి తాను తీసుకున్న సినిమాటిక్ లిబర్టీ ఇదని క్రిష్ వెల్లడించాడు.

పుస్తకంలో కథానాయిక పాత్ర లేదని.. కానీ ఈ కథకు ఓ అందమైన ప్రేమకథను జోడిస్తే ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో ఓబులమ్మ పాత్రను జోడించినట్లు క్రిష్ వెల్లించాడు. ఈ పాత్రను సినిమాలో పెట్టాలనుకున్నపుడు ఒరిజినల్ రైటర్ సన్నపురెడ్డి వెంకటరెడ్డితో మాట్లాడానని.. ఆయన కూడా ఈ పాత్రను తీర్చిదిద్దడంలో తన వంతు సాయం అందించారని క్రిష్ తెలిపాడు. మోడర్న్‌గా కనిపించే రకుల్.. ఈ పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయిందని క్రిష్ తెలిపాడు.

ఈ సినిమా చిత్రీకరణ గోవాలో జరపాలని అనుకున్నామని.. కానీ ఈ కథలో పులి, గొర్రెలు ఉంటాయని.. గొర్రెల మీద పులి దాడి చేసే సన్నివేశాలు ఉంటాయని తెలిసి అక్కడి అధికారులు షూటింగ్‌కు అనుమతులు ఇవ్వలేదని క్రిష్ తెలిపాడు. దీంతో మన చుట్టూ ఉన్న ప్రాంతాలను పరిశీలించి వికారాబాద్ అడవుల్లో చిత్రీకరణ జరిపామని.. సినిమాలో మెజారిటీ సన్నివేశాలు అక్కడ తీసినవే అని క్రిష్ వెల్లడించాడు.