జూన్.. ఇది ప్ర‌భాస్ అభిమానుల నెల‌

యువి క్రియేష‌న్స్ వ‌ర‌స్ట్ బేన‌ర్.. ఈ మ‌ధ్య ట్విట్ట‌ర్లో ట్రెండ్ అయిన హ్యాష్ ట్యాగ్ ఇది. ఈ ప‌ని చేసింది ప్ర‌భాస్ అభిమానులే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. సాహో మొద‌లైన‌ ద‌గ్గ‌ర్నుంచి ఈ వ్య‌వ‌హారం న‌డుస్తోంది. అభిమానుల్ని దృష్టిలో ఉంచుకుని ఆ సంస్థ స‌మ‌యానుకూలంగా అప్ డేట్స్ ఇవ్వ‌ద‌ని, వారి కోసం కానుక‌లేమీ రెడీ చేయ‌ద‌ని వాళ్లు మండిప‌డుతుంటారు.

ఈ విష‌యంలో ప్రొడ‌క్ష‌న్ హౌజ్ ఆఫీస్ వ‌ద్ద‌కెళ్లి గొడ‌వ చేసే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లింది. అయినా ఆ సంస్థ ప్ర‌భాస్ కొత్త సినిమా విష‌యంలోనూ అభిమానుల ఆకాంక్ష‌ల‌కు త‌గ్గ‌ట్లు న‌డుచుకోవ‌ట్లేదు. రాధాకృష్ణ‌కుమార్ దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ 70-80 శాతం పూర్త‌యినా ఇప్ప‌టిదాకా టైటిల్ ప్ర‌క‌టించ‌లేదు. ఫ‌స్ట్ లుక్ రిలీజ్ లేదు. వాటి గురించి అప్ డేట్ కూడా లేదు.

ఐతే ఈ మ‌ధ్య ప్ర‌భాస్ అభిమానులు మ‌రోసారి విరుచుకుప‌డేస‌రికి.. ఆ సంస్థ స్పందించింది. లాక్ డౌన్ ముగిసి, సినీ కార్య‌క‌లాపాలు పునఃప్రారంభ‌మ‌య్యాక అప్ డేట్ ఉంటుంద‌ని తెలిపింది. లాక్ డౌన్ స‌డ‌లింపులిచ్చి షూటింగ్స్ త్వ‌ర‌లోనే పునఃప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఆ సంస్థ మాట నిలుపుకోనుంది. సోమ‌వారం చిత్ర పీఆర్ వ‌ర్గాలు ఈ మేర‌కు అభిమానుల‌కు ఇన్ పుట్స్ ఇచ్చాయి.

జూన్ ప్ర‌భాస్ అభిమానుల నెల అని.. వారికి కానుక సిద్ధ‌మ‌వుతోంద‌ని కొంద‌రు టాలీవుడ్ పీఆర్వోలు సంకేతాలిచ్చారు. బ‌హుశా ఈ నెల మ‌ధ్య‌లో టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేసే అవ‌కాశ‌ముంది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి రాధేశ్యామ్, జాన్ అనే టైటిళ్లు ప్ర‌చారంలో ఉన్నాయి. యువి వాళ్ల‌తో క‌లిసి ప్ర‌భాస్ పెద‌నాన్న కృష్ణంరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.