డైన‌మైట్ దేవా క‌ట్టా తీయ‌లేద‌ట‌

ప్ర‌స్థానం సినిమాతో త‌న‌పై అంచ‌నాల‌ను భారీగా పెంచేశాడు ద‌ర్శ‌కుడు దేవా క‌ట్టా. కానీ ఆ త‌ర్వాత ఆయ‌న్నుంచి ఆశించిన సినిమాలు రాలేదు. ఆటోన‌గ‌ర్ సూర్య ఏవో వివాదాల్లో చిక్కుకుని చాలా ఆల‌స్యంగా విడుద‌లైంది. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌నూ అందుకోలేక‌పోయింది. ఆ త‌ర్వాత దేవా ఆశ్చ‌ర్య‌క‌రంగా ఒక రీమేక్ మూవీ చేశాడు. అదే.. డైన‌మైట్.

త‌మిళంలో సూప‌ర్ హిట్ట‌యిన అరిమా నంబికి ఇది రీమేక్. మంచు విష్ణు హీరోగా న‌టించాడు. ఇది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణ‌మైన ఫ‌లితాన్నందుకుంది. అందులో దేవా ముద్ర అస‌లేమాత్రం క‌నిపించ‌లేదు. దేవా ఇలాంటి సినిమా తీశాడేంట‌న్న విమ‌ర్శ‌లు వచ్చాయి.

ఐతే ఆ సినిమాకు ద‌ర్శ‌కుడిగా తాను చేసింది పెద్ద‌గా ఏమీ లేదంటూ ఇప్పుడు సంచ‌ల‌న విషయాలు వెల్ల‌డించాడు దేవా. తాను యుఎస్ నుంచి వ‌చ్చేశాక ఫ్ర‌స్టేష‌న్లో ఉండ‌గా, ఆర్థికంగా ఇబ్బంది ప‌డుతున్న స‌మ‌యంలో ఈ సినిమాను ఒప్పుకున్నాన‌ని.. కానీ ఈ చిత్రానికి సంబంధించి తాను కేవ‌లం తొమ్మిది రోజులు మాత్ర‌మే షూటింగ్‌లో పాల్గొన్నానని.. త‌ర్వాత వేరే వాళ్ల‌ను పెట్టి వాళ్ల ఇష్ట‌మొచ్చిన‌ట్లు సినిమా తీసుకున్నార‌ని త‌న కొత్త చిత్రం రిప‌బ్లిక్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా మీడియాను క‌లిసిన సంద‌ర్భంగా దేవా వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

ఇక ప్ర‌స్థానం త‌ర్వాత త‌న సినిమాలు స‌రైన ఫ‌లితాలు అందుకోక‌పోవ‌డానికి కార‌ణాలు చెబుతూ.. ‘‘ప్ర‌స్థానం బ్లాక్‌బ‌స్ట‌ర్ కాక‌పోవ‌డానికి కామెడీ ట్రాక్ లేక‌పోవ‌డ‌మో, మ‌రోటో అని న‌న్ను క‌న్విన్స్ చేసి, నేను ఆ ట్రాప్‌లో ప‌డేలా కొంద‌రు చేశారు. ఐతే ఆ త‌ర్వాత నేనెదైతే చెత్త పెట్టానో దాన్ని ప్ర‌జ‌లు తిప్పి కొట్టారు. కానీ రిప‌బ్లిక్ విష‌యంలో ఇలాంటివేమీ లేకుండా నేను ఓన్ చేసుకుని చేసిన సినిమా’’ అని దేవా అన్నాడు. త‌న‌ విజ‌న్‌లోనే ఈ సినిమా తీసేలా సాయితేజ్ సినిమా చేయ‌డానికి ఎంక‌రేజ్ చేశాడని.. సైనికుడిలా త‌న‌కు అండ‌గా నిల‌బ‌డ్డాడని దేవా చెప్పాడు.