పవన్ వల్ల ఏం ఒరిగింది?

కరోనా సెకండ్ వేవ్ తర్వాత అత్యంత హైప్ తెచ్చుకున్న ‘లవ్ స్టోరి’ మూవీ గత వారాంతంలోనే విడుదలైంది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్లో అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టుకుంది. మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఒకప్పటిలా కళకళలాడాయి. డివైడ్ టాక్, బంద్, వర్షాల కారణంగా వీకెండ్ తర్వాత జోరు ఈ సినిమా జోరు బాగా తగ్గింది.

దీంతో ఇక ఫోకస్ ఆటోమేటిగ్గా ఈ వారాంతంలో విడుదల కానున్న ‘రిపబ్లిక్’ మీదికి మళ్లుతోంది. ఐతే ఈ సినిమాకు ఇప్పటిదాకా అయితే అనుకున్నంత హైప్ లేదు. బేసిగ్గా ఇది సీరియస్ మూవీ కావడం కొంత మైనస్సే. సామాజిక, రాజకీయ అంశాల చుట్టూ దేవా కట్టా చాలా సిన్సియర్‌గా ఈ సినిమా తీసినట్లున్నాడు.

ఐతే కంటెంట్ మరీ సీరియస్‌గా ఉండటంతో యువ ప్రేక్షకుల్లో అంత ఆసక్తి కనిపించడం లేదు. ప్రమోషన్లు కొంచెం గట్టిగా చేసి సినిమాకు హైప్ పెంచాల్సిన టైంలో హీరో సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ కారణంగా ఆసుపత్రికి పరిమితం కావడం మైనస్ అయింది.

ఐతే ‘రిపబ్లిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్ కొంచెం గట్టిగా చేసి హైప్ పెంచాలనుకున్నారు. ఇందుకోసమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ముఖ్య అతిథిగా పిలిపించారు కూడా. కానీ ఆయన ఆ వేడుకలో పూర్తిగా రాజకీయాల మీద మాట్లాడి ఫోకస్ మళ్లించేశాడు. ఈ వేడుక అయ్యేసరికి అందరూ ‘రిపబ్లిక్’ గురించి మరిచిపోయారు.

పూర్తిగా పవన్ చేసిన రాజకీయ వ్యాఖ్యల గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. దీంతో సినిమా పక్కకు వెళ్లిపోయింది. ఈ వేడుకకు పవన్ ప్లస్ అవుతాడనుకుంటే.. ఈ వేడుకే పవన్‌కు ప్లస్ అయింది. పవన్ వల్ల సినిమాకు పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ మీడియాను కలవడం వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. ఎంతైనా ఒక సినిమా రిలీజ్ ముంగిట దాని హీరో మీడియా ముందుకొస్తే వచ్చే హైప్ వేరని రుజువవుతోంది.

యాక్సిడెంట్ తర్వాత తేజు ఈపాటికి కోలుకుని మీడియాను కలిసి ఉంటే మీడియా దృష్టి మొత్తం అతడి చుట్టూ, తన సినిమా చుట్టూ తిరిగేది. అతను లేకపోడవడం మైనస్ అవుతోంది. మరి లో బజ్‌తో రిలీజవుతున్న ‘రిపబ్లిక్’ ఏమేర ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి.