హీరోయిన్ మీద యాసిడ్ దాడికి యత్నం


ఫ్రయాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత ‘ఊసరవెల్లి’ సహా రెండు మూడు సినిమాల్లో నటించిన పాయల్ ఘోష్ గుర్తుందా? సినిమాల్లో అనుకున్నంతగా మెరవలేక పోయిన ఈ భామ వేరే విషయాలతో వార్తల్లో నిలిచింది గతంలో. గత ఏడాది ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మీద లైంగిక వేధింపుల ఆరోఫణలు చేయడం ద్వారా ఆమె వార్తల్లో వ్యక్తిగా మారింది. ఆ ఆరోపణల సంగతి ఏమైందో ఏంటో కానీ.. తర్వాత పాయల్ గురించి చప్పుడే లేదు.

ఐతే ఇప్పుడామె మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తనపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి ప్రయత్నించారంటూ ఆమె మీడియాకు వెల్లడించడం సంచలనం రేపింది. చేతికి గాయాలైన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంటూ.. ఈ దాడి ఘటన గురించి వివరాలు వెల్లడించింది. ఈ పోస్టులో ఆమె ఏమందంటే..

“మా కుటుంబ సభ్యులకు మందులు అవసరం పడటంతో వాటిని తీసుకొద్దామని చాలా రోజుల తర్వాత బయటకి వెళ్లాను. నా పని పూర్తి చేసుకుని కారు ఎక్కుతుంటే.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి.. నాపై దాడి చేశారు. వాళ్ల చేతుల్లో యాసిడ్‌ బాటిల్స్ ఉన్నాయి. అవి చూడగానే సాయం కోరుతూ గట్టిగా కేకలు వేశాను. దాంతో వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడిలో నా చేతులకు గాయాలయ్యాయి. ఆ సంఘటన తర్వాత నాకు క్షణ క్షణం నాకు భయమేస్తోంది. ఆ ఘటనను తలుచుకుంటుంటే ఇప్పటికీ కంగారుగానే ఉంది” అని పాయల్‌ వివరించింది.

మరి తనపై దాడికి ఎవరు ప్రయత్నించి ఉండొచ్చనే విషయంలో పాయల్ హింట్స్ ఏమీ ఇవ్వలేదు. ఎవరి మీదా అనుమానాలు వ్యక్తం చేయలేదు. మరి ఆమెపై దాడికి ప్రయత్నించింది ఎవరో ఏమో. చివరగా పాయల్ హిందీలో ‘పటేల్‌ కీ పంజాబీ షాదీ’ అనే సినిమా చేసింది. ఆ తర్వాతి నుంచి ఆమె ఖాళీగానే ఉంది.