హీరోల పారితోష‌కం ప్ర‌భుత్వం చేతుల మీదుగాన‌ట‌


ఒక సినిమాకు ప‌ని చేసే న‌టీన‌టుల‌కు.. సాంకేతిక నిపుణుల‌కు ప్ర‌భుత్వమే పారితోష‌కం ఇస్తే..?పారితోష‌కాల కింద ఇవ్వాల్సిన డ‌బ్బుల‌న్నీ నిర్మాతల ద‌గ్గ‌ర్నుంచి క‌లెక్ట్ చేసి.. వాటిని ఒక అకౌంట్లో వేసి దాని ద్వారా అంద‌రికీ ప్ర‌భుత్వ‌మే చెల్లింపులు చేస్తే..? ఈ ప్ర‌తిపాద‌నలు వింటే ఏమ‌నిపిస్తోంది? ఇదెలా సాధ్యం అంటారా? మాజీ మంత్రి.. కాపు నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి ఈ చిత్ర‌మైన ప్ర‌తిపాద‌న‌లు చేశారు.

తన‌కు ఒకప్పుడు ఎగ్జిబిట‌ర్‌గా ప‌ని చేసిన అనుభ‌వంతో ఈ సూచ‌న‌లు చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఆయ‌న ఒక లేఖ కూడా రాయ‌డం విశేషం. ఆ లేఖలో ఆయ‌న ఇంకా ఏమేం అన్నారంటే..

“సినిమా టికెట్లు ఆన్‌లైన్లో విక్రయించేలా చూడాలని ప్రముఖ నటులు మిమ్మల్ని కోరిన విషయం ఎమ్‌. ఎల్‌.ఎ.రోజా, మరికొందరు పెద్దలు వెల్లడించిన సంగతి పత్రికల్లో చూశా. వారు కోరిన విధానం చాలా మంచిది. మాజీ ఎగ్జిబిటర్‌గా నేను కొన్ని సూచనలు ఇవ్వాలనుకుంటున్నా. వీటిని అందరూ గౌరవించాలని కోరుకుంటున్నా. నటీనటులు, సాంకేతిక బృంద సభ్యులు, కార్వాన్లు, వసతి గృహాలు, భోజనం తదితర వాటికి సంబంధించిన ఖర్చుని నిర్మాత నుంచి తీసుకుని, ప్రభుత్వం దాన్ని నేరుగా సినిమా కోసం పనిచేసే వారి (నటీనటులు, సాంకేతిబృంద సభ్యులు తదితరులు) బ్యాంకు ఖాతాల్లోకి పంపిస్తే బాగుంటుంది. అప్పుడు ఎలాంటి అనవరసరపు ఖర్చులు, ఎగవేతలు ఉండవు. ప్రతి పైసా ఎలా ఖర్చు చేశామో తెలుస్తుంది. బ్లాక్‌ మనీ అనే మాట వినిపించదు. వైట్‌ మనీతోనే వ్యాపారం నడుస్తుంది. చిత్ర నిర్మాణ వ్యయం తగ్గే అవకాశం ఉంది” అని త‌న లేఖ‌లో ముద్ర‌గ‌డ‌ పేర్కొన్నారు.

ఐతే ముద్ర‌గ‌డ ప్ర‌తిపాద‌న‌ల‌పై ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. నిర్మాత‌ల క‌ష్టం తెలియాలంటే ముద్ర‌గ‌డ ముందు ఒక సినిమా నిర్మించి.. ఆ త‌ర్వాత ఇలాంటి ప్ర‌తిపాద‌న‌లు చేయాల‌ని ఆయ‌న‌న్నారు.