‘యాత్ర-2’కు భయపడ్డారా?

దివంగత కాంగ్రెస్ నేత.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. సినిమాల్లో, రాజకీయాల్లో తిరుగులేని పేరు సంపాదించిన సీనియర్ ఎన్టీఆర్ మీద తీసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనిపిస్తే.. వైఎస్ బయోపిక్‌కు మాత్రం ఉన్నంతలో మంచి ఫలితమే దక్కింది. వైఎస్ అభిమానులను ఆ చిత్రం కదిలించేసింది. సామాన్య ప్రేక్షకులను కూడా ఓ సినిమాగా అది మెప్పించింది. పాఠశాల, ఆనందో బ్రహ్మ చిత్రాల దర్శకుడు మహి వి.రాఘవ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. అతను వైఎస్‌కు వీరాభిమాని. వైఎస్ కుటుంబంతో అతడికి మంచి సాన్నిహిత్యం కూడా ఉంది.

ఐతే ‘యాత్ర’కు మంచి ఫలితం రావడంతో దీనికి కొనసాగింపుగా వైఎస్ జగన్ జీవిత కథ ఆధారంగా ‘యాత్ర-2’ చేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు మహి. కానీ ‘యాత్ర’ విడుదలై రెండున్నరేళ్లు దాటినా ఈ సినిమా గురించి సంకేతాలు ఏమీ రాలేదు. కాగా ‘యాత్ర’ నిర్మాతలు విజయ్ చిల్లా, శశి మాత్రం ‘యాత్ర-2’ చేసే అవకాశాలు లేనట్లే మాట్లాడటం గమనార్హం. ‘యాత్ర’ చేసిన బేనర్లోనే ‘యాత్ర-2’ కూడా తెరకెక్కుతుందని ఇంతకుముందు వార్తలొచ్చాయి. కానీ విజయ్, చిల్లా మాత్రం ‘యాత్ర-2’ చేసే అవకాశాలు లేవని.. తమ బేనర్లో అలాంటి ప్రయత్నాలేమీ జరగట్లేదని తేల్చేశారు. అసలు ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ జీవిత కథ ఆధారంగా ‘యాత్ర-2’ చేస్తే ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వస్తుందా అన్నదీ సందేహమే.

బేసిగ్గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ వేరు. జగన్ ఇమేజ్ వేరు. పైగా వైఎస్ మరణానంతరం ఆయన ఇమేజ్ ఇంకా పెరిగింది. ఎమోషనల్‌గా ప్రేక్షకులను కదిలించడానికి వైఎస్ బయోపిక్‌లో స్కోప్ ఉంది. కానీ జగన్ బయోపిక్ విషయంలో ప్రేక్షకులను అలా టచ్ చేయడానికి అవకాశం తక్కువ. జగన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఉండొచ్చు కానీ.. ఈ సినిమాతో ఎమోషనల్ కనెక్ట్ తీసుకురావడం కష్టం. పైగా ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండగా బయోపిక్ తీస్తే ప్రేక్షకులను రుచించకపోవచ్చు. అందులోనూ ప్రస్తుతం జగన్ సర్కారు అనేక వివాదాలను, విమర్శలను ఎదుర్కొంటోంది. ఇలాంటి టైంలో జగన్ బయోపిక్ తీస్తే అది నెగెటివ్‌ ఎఫెక్టే చూపించొచ్చు. అందుకు ‘యాత్ర-2’ చేయడానికి మేకర్స్ భయపడ్డారేమో అనిపిస్తోంది.