గోపీచంద్ వ‌చ్చాడు.. అత‌ను సైడైపోయాడు


స‌రైన హిట్టు కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్. నిను వీడ‌ని నీడ‌ను నేనే, ఎ1 ఎక్స్‌ప్రెస్ లాంటి సినిమాలో ఓ మోస్త‌రుగా ఆడాయి కానీ.. చాలా ఏళ్ల నుంచి నిఖార్స‌యిన విజ‌యం మాత్రం ద‌క్క‌ట్లేదు. ఆ లోటును గ‌ల్లీ రౌడీ భ‌ర్తీ చేస్తుంద‌న్న ఆశ‌తో ఉన్నాడు సందీప్. క‌రోనా సెకండ్ వేవ్ కంటే ముందే ఈ సినిమా పూర్త‌యినా.. థియేట‌ర్లు మూత ప‌డ‌టంతో రిలీజ్ ఆల‌స్య‌మైంది. ఈ మ‌ధ్యే థియేట‌ర్లు తెరుచుకుని వ‌సూళ్లు కూడా పుంజుకుంటున్న నేప‌థ్యంలో సెప్టెంబ‌రు 3న ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తేవాల‌ని నిర్ణ‌యించింది చిత్ర బృందం.

అధికారికంగా రిలీజ్ డేట్ ప్ర‌క‌టించి, పోస్ట‌ర్లు కూడా వ‌దిలారు. ప్ర‌మోష‌న్లు కూడా గ‌ట్టిగా ప్లాన్ చేసుకున్నారు. ఐతే వారి ఉత్సాహం మీద గోపీచంద్ మూవీ సీటీమార్ టీం నీళ్లు చ‌ల్లింది. మంచి అంచ‌నాలున్న ఆ మాస్ సినిమాను సెప్టెంబ‌రు 3నే విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఆల్రెడీ అవ‌స‌రాల శ్రీనివాస్ సినిమా నూటొక్క జిల్లాల అంద‌గాడు కూడా సెప్టెంబ‌రు 3కే ఫిక్స్ అయింది. అదే రోజు హాలీవుడ్ మూవీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్-9 కూడా ఇండియాలో పెద్ద ఎత్తున రిలీజ‌వుతోంది. ఇంత పోటీ మ‌ధ్య త‌మ సినిమా దెబ్బ తింటుంద‌ని అనుకున్నారో ఏమో… ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

దీని స‌మ‌ర్ప‌కుడు కోన వెంక‌ట్ ఒకింత అస‌హ‌నంతోనే ట్వీట్ కూడా పెట్టారు. ఆరోగ్యక‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉండాల‌ని త‌మ చిత్రాన్ని సెప్టెంబ‌రు 3న రిలీజ్ చేయాల‌ని ప్ర‌క‌టించామ‌ని, కానీ ఇప్పుడు వాయిదా వేస్తున్నామ‌ని.. ఐతే సెప్టెంబ‌ర్లోనే త‌మ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఆ ట్వీట్ చూస్తే.. ఉన్న‌ట్లుండి సీటీమార్ చిత్రాన్ని సెప్టెంబ‌రు 3కు ఫిక్స్ చేయ‌డం తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లే క‌నిపిస్తోంది.