‘రాక్షసుడు-2’ కోసం సేతుపతిని అడిగితే..

తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్టయిన థ్రిల్లర్ మూవీ ‘రాక్షసన్’ను తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో రీమేక్ చేసి మంచి విజయాన్నందుకున్నాడు దర్శకుడు రమేష్ వర్మ. దీని కంటే ముందు అతను తీసిన చిత్రాల్లో చాలా వరకు నిరాశ పరిచినవే. ‘రైడ్’ ఒక్కటే ఓ మోస్తరుగా ఆడింది. దర్శకుడిగా రమేష్ పనైపోయిందనుకున్న టైంలో ‘రాక్షసుడు’తో మళ్లీ నిలదొక్కుకున్నాడు.
రీమేక్ మూవీతో హిట్టు కొట్టినప్పటికీ రమేష్‌కు రవితేజ అవకాశం ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. వీరి కలయికలో తెరకెక్కుతున్న ‘ఖిలాడి’ చివరి దశలో ఉంది. దీని తర్వాత రమేష్ వర్మ చేయబోయే సినిమా కూడా ఖరారైంది. ‘రాక్షసుడు’ సీక్వెల్ తీయబోతున్నాడతను.

‘రాక్షసుడు’ చిత్రాన్ని నిర్మించిన కోనేరు సత్యనారాయణనే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయనున్నాడు. దీని బడ్జెట్ రూ.100 కోట్లని, పాన్ ఇండియా లెవెల్లో ఇది తెరకెక్కనుందని, ఓ స్టార్ హీరో లీడ్ రోల్ చేస్తాడని ఇప్పటికే ప్రకటన రావడం తెలిసిందే.

ఐతే ‘రాక్షసుడు’లో ప్రధాన పాత్ర ఎవరు చేస్తారన్న దానిపై ఇప్పటిదాకా క్లారిటీ రాలేదు. కాగా ఈ పాత్ర కోసం తమిళ నటుడు విజయ్ సేతుపతిని అడిగినట్లు దర్శకుడు రమేష్ వర్మ తాజాగా మీడియాకు వెల్లడించాడు. ఐతే ఈ సినిమాకు సేతుపతి ఆమోదం తెలపలేదని, అలాగని నో కూడా చెప్పలేదని రమేష్ తెలిపాడు. వెయిట్ చేయమని మాత్రమే చెప్పినట్లు వెల్లడించాడు.
‘రాక్షసుడు’ రీమేక్‌ను పరిశీలిస్తే ఒరిజినల్‌ నుంచి మక్కీకి మక్కీ దించేశారని అర్థమవుతుంది. మరి వేరే భాష నుంచి రీమేక్ చేసిన సినిమాకు కొనసాగింపుగా కొత్తగా రమేష్ ఎలాంటి స్క్రిప్టు తయారు చేసి ఉంటాడన్నది ఆసక్తికరం. రమేష్ సొంతంగా తీసిన సినిమాల్లో ఏదీ ఇప్పటిదాకా ఆకట్టుకోలేదు. ‘రైడ్’ సైతం ఓ కొరియన్ సినిమాకు కాపీ అన్న సంగతి తెలిసిందే. మరి డేట్లు సర్దుబాటు చేయలేక వేర్వేరు భాషల్లో పెద్ద పెద్ద దర్శకులకే నో చెబుతున్న సేతుపతి.. రమేష్ స్క్రిప్టు నచ్చి ‘రాక్షసుడు-2’ సినిమా చేస్తే అది విశేషమే అవుతుంది.