సుకుమార్ మహేష్‌ను కలిశాడు కానీ.


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, అగ్ర దర్శకుడు సుకుమార్‌ల కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘1 నేనొక్కడినే’పై విడుదలకు ముందు ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో తెలిసిందే. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో ఆ చిత్రం విఫలమైంది. ఆ సమయానికి మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిందీ సినిమా. రిలీజ్ తర్వాత క్లాసిక్ స్టేటస్ తెచ్చుకుంటేనేమి.. ఆ చిత్రాన్ని నమ్ముకున్న వాళ్లందరికీ చేదు అనుభవమే మిగిల్చిందా సినిమా. మళ్లీ వీరి కలయికలో ఓ సినిమా కోసం రెండేళ్ల ముందు సన్నాహాలు జరగడం తెలిసిందే.

మైత్రీ మూవీ మేకర్స్ బేనర్లో ఇద్దరూ సినిమా చేయడానికి ఓకే అనుకున్నారు. దాదాపు ఆరు నెలల పాటు కథా చర్చలు నడిచాయి. కానీ తర్వాత ఏమైందో ఏమో ఈ సినిమా ఉన్నట్లుండి ఆగిపోయింది. మహేష్‌తో అనుకున్న కథతోనే అల్లు అర్జున్ హీరోగా సినిమా మొదలుపెట్టాడు సుక్కు. అదే.. పుష్ప. ఆ టైంలో మహేష్, సుక్కుల మధ్య గ్యాప్ వచ్చిన మాట వాస్తవం.

ఐతే ఇద్దరూ మళ్లీ కలిసి ఓ సినిమా చేస్తారని ఎప్పటికప్పుడు గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఆ దిశగా సంకేతాలు మాత్రం కనిపించడం లేదు. ఎవరికి వాళ్లు వేరే కమిట్మెంట్లతో బిజీగా ఉన్నారు. ఐతే తాజాగా మహేష్, సుకుమార్ మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్‌లో కలవడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకోవడంతో మళ్లీ కలిసి సినిమా చేస్తారా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఐతే ఈ ఇద్దరూ వేర్వేరుగా మైత్రీ బేనర్లో పని చేస్తున్న నేపథ్యంలోనే అనుకోకుండా అక్కడ కలిశారు. చాన్నాళ్లకు అనుకోకుండా కలిశారు కాబట్టి రకరకాల విషయాలపై మాట్లాడుకున్నారు.
అంతే తప్ప ఇద్దరి కలిసి సినిమా చేసే విషయం ఎంతమాత్రం చర్చకు రాలేదని సమాచారం.

సుకుమార్ సినిమా చేయాలనుకున్నా.. మహేష్ ఇంకో ఐదేళ్ల వరకు ఆయనకు దొరికే పరిస్థితి లేదు. ‘సర్కారు వారి పాట’ అవ్వగానే త్రివిక్రమ్ సినిమా చేయాలి. ఆపై రాజమౌళి సినిమా మొదలవుతుంది. ఈ మూడూ పూర్తయ్యేసరికే ఇంకో రెండు మూడేళ్లు పడుతుంది. ఆపై సందీప్ రెడ్డి వంగ, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి లైన్లో ఉన్నారు. సుకుమార్ లైన్లోకి వచ్చినా ఆయన నంబర్ వీళ్ల తర్వాతే. అంత ఖాళీగా లేని హీరోతో ఇంత ముందుగా సుక్కు కమిట్మెంట్ తీసుకునే టైపైతే కాదు. కాబట్టి వీరి కలయిక గురించి మరీ ఎక్కువ చర్చించాల్సిన అవసరం లేదేమో.