ఓటీటీ రిలీజ్‌లపై మహేష్ ఒపీనియన్

కరోనా దెబ్బకు థియేటర్ ఇండస్ట్రీ విలవిలలాడిపోగా.. ఓటీటీ ఇండస్ట్రీ మాత్రం అద్భుతంగా పుంజుకుంది. ఇండియాలో ఓటీటీ విప్లవం రావడానికి కరోనా కారణమైంది. ఆల్రెడీ ఉన్న వాటికి కొత్త ఓటీటీలు తోడయ్యాయి. కుప్పలు కుప్పలుగా కంటెంట్ ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే కొత్త కొత్త చిత్రాలను కూడా నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. ముందు చిన్న సినిమాలే వచ్చాయి కానీ.. రాను రాను పెద్ద పెద్ద చిత్రాలు సైతం ఓటీటీ బాట పడుతున్నాయి.

ఈ మధ్యే తెలుగులో ‘నారప్ప’ లాంటి పెద్ద సినిమా ఓటీటీలో రిలీజైన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో అయితే అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ లాంటి సూపర్ స్టార్లు నటించిన సినిమాలు ఓటీటీల ద్వారా విడుదల కావడం తెలిసిందే. ఐతే తెలుగులో కూడా భవిష్యత్తులో ఈ ఒరవడి మొదలవుతుందా అన్న చర్చ నడుస్తోంది.

ఐతే మిగతా స్టార్ల విషయం ఏమో కానీ.. మహేష్ బాబు మాత్రం తన చిత్రాలను ఎప్పటికీ ఓటీటీల్లో రిలీజ్ చేసే అవకాశం లేదన్నట్లు సంకేతాలిచ్చాడు. తన అభిమానులకు థియేటర్లతో ఉన్న కనెక్షన్‌ను తాను తెంచబోనని.. తన సినిమాలన్నీ థియేటర్లలో ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా తెరకెక్కుతాయని.. వాటిని ఆ మార్గంలోనే రిలీజ్ చేస్తామని అతను స్పష్టం చేశాడు.

ఐతే అలాగని ఓటీటీలను తక్కువ చేసి చూడనని మహేష్ అన్నాడు. ఓటీటీలను తాను గౌరవిస్తానని చెప్పాడు. ఓటీటీ అనేది ప్ర‌త్యేక‌మైన సంస్థ అని మ‌హేష్ వ్యాఖ్యానించాడు. అయితే మ‌న సూప‌ర్ స్టార్ ఇప్పుడిలా అంటున్నాడు కానీ.. ఏమో భ‌విష్య‌త్తులో ఒకేసారి థియేట‌ర్ల‌లో, ఓటీటీల్లో భారీ చిత్రాలు విడుద‌ల కావ‌చ్చేమో. ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో మ‌హేష్ లాంటి హీరోల సినిమాలూ నేరుగా ఓటీటీలో విడుద‌ల‌వుతాయేమో. అస‌లు చిన్న, మీడియం రేంజ్ సినిమాలు ఓటీటీలో నేరుగా రిలీజ‌వుతాయనే కొన్నేళ్ల ముందు ఊహించ‌లేదు. మ‌రి భ‌విష్య‌త్తులో ఏమ‌వుతుందో?