పుష్ప పాట.. ఓ సంచలనమే


దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుతుంది పీక.. అంటూ సాగే తొలి పాటను త్వరలోనే రిలీజ్ చేయబోతోంది ‘పుష్ప’ టీం. ఈ పాట గురించి అనౌన్స్‌మెంట్ ఇస్తూ రిలీజ్ చేసిన చిన్న వీడియో గ్లింప్స్‌యే ప్రేక్షకులను ఎంతో ఎగ్జైట్ చేస్తుంది. పాట సాహిత్యం.. కంపోజిషన్.. పాడిన తీరు అన్నీ కూడా చాలా ప్రత్యేకంగా అనిపించాయి. ఇక ఫుల్ సాంగ్ రిలీజైతే ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ పాట టాలీవుడ్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమట.

సుకుమార్ ఈ పాట మీద పెట్టిన ఫోకస్ అంతా ఇంతా కాదని అంటున్నారు. పాట రాయించడంలో.. కంపోజిషన్లో.. అలాగే టేకింగ్‌లో సుకుమార్ చాలా సమయమే వెచ్చించినట్లు సమాచారం. సుక్కు ఫేవరెట్ లిరిసిస్ట్ చంద్రబోస్ ఈ పాట రాయగా.. వేర్వేరు భాషల్లో వేర్వేరు గాయకులు ఈ పాటను ఆలపించారు. తెలుగులో శివం అనే గాయకుడు పాడాడీ పాట.

ఈ పాటను చిత్రీకరించిన తీరు చాలా ప్రత్యేకం అంటున్నారు. ‘పుష్ప’ థీమ్ అంటే ఇందులోనే ఉంటుందని.. ఇప్పటిదాకా ప్రేక్షకులు చూడని లొకేషన్లలో ఈ పాట తీశారని.. ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ చాలా కొత్తగా అనిపించేలా పాటను తీశారని తెలిసింది. బాలీవుడ్ లెజెండరీ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ పాటకు నృత్య రీతులు సమకూర్చారు. ఇందులో బన్నీ సిగ్నేచర్ స్టెప్స్ అభిమానులను ఉర్రూతలూగించేస్తాయని సమాచారం.

టేకింగ్ ఒక లెవెల్లో ఉంటుందని.. పూర్తిగా అటవీ నేపథ్యంలో, భారీగా జూనియర్ ఆర్టిస్టుల నడుమ పాటను తీశారని.. ఈ ఒక్క పాటకే నిర్మాతలు ఏకంగా రెండున్నర కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం. ఈ పాట వినడానికే కాక విజువల్‌గా చాలా బాగుంటుందని. ఆ సాంగ్ నడుస్తున్న టైంలో థియేటర్లు హోరెత్తిపోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ముందుగా రిలీజ్ కానున్న ఈ సాంగ్ లిరికల్ వీడియోతోనే ఇన్‌స్టంట్‌గా ప్రేక్షకులకు ఎక్కేస్తుందని చెబుతున్నారు.