కీరవాణి కొడుకు.. దొంగలున్నారు జాగ్రత్త


కీరవాణి కొడుకుల్లో ఒకరు ఆయన సంగీత వారసత్వాన్ని అందుకుంటే.. మరొకరు మాత్రం నటన వైపు అడుగులేశారు. పెద్ద కొడుకు కాలభైరవ ఇప్పటికే సంగీత దర్శకుడిగా నిలదొక్కుకున్న సంగతి తెలిసిందే. రెండో కొడుకు సింహా తొలి చిత్రం ‘మత్తు వదలరా’తో మంచి ఫలితాన్నే అందుకున్నప్పటికీ.. రెండో చిత్రం ‘తెల్లవారితే గురువారం’ మాత్రం అతణ్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. మంచి అంచనాల మధ్యే విడుదలైనప్పటికీ ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితం దక్కింది. దీని తర్వాత సింహా ఆచితూచి అడుగులు వేయాల్సిన స్థితిలో కొంచెం గ్యాప్ తీసుకుని కొత్త చిత్రాన్ని ప్రకటించాడు.

గురువారమే ఈ చిత్రం ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. ఈ చిత్రానికి ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. అగ్ర నిర్మాత సురేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. సతీష్ త్రిపుర అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు.

ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని ‘దొంగలున్నారు జాగ్రత్త’లో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా హీరోయిన్ పేరు కూడా వెల్లడించలేదు కానీ.. సముద్రఖని పేరును ప్రకటించడం విశేషం. అల వైకుంఠపురములో, క్రాక్ సినిమాలతో సముద్రఖనికి తెలుగులో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చేస్తూ రాజమౌళి కుటుంబానికి ఆయన సన్నిహితుడిగా మారారు.

ఈ ఫ్యామిలీకే చెందిన అశ్విన్ గంగరాజు రూపొందించిన ‘ఆకాశవాణి’లో కూడా సముద్రఖని కీలక పాత్ర పోషించడం తెలిసిందే. ఇప్పుడు సింహా సినిమాలోనూ ఆయన నటిస్తున్నారు. ‘దొంగలున్నారు జాగ్రత్త’ పేరుతో గతంలోనే ఒక సినిమా వచ్చింది. హిట్టయింది. మరి ఈ మోడర్న్ దొంగలు ప్రేక్షకుల మనసులు ఏమేర దోస్తారో చూడాలి. సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి గురు ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.