చిరు.. ప్రకాష్ రాజ్.. మధ్యలో నాగబాబు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రసకందాయంలో పడేట్లే కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకోవడమే కాదు.. ‘మా బిడ్డలు’ పేరుతో తన ప్యానెల్‌ను సైతం ప్రకటించారు. వాళ్లతో కలిసి ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టి తన ఉద్దేశాల్ని, లక్ష్యాల్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్ నాగబాబు సైతం పాల్గొనడం విశేషం. ఆయన ప్రకాష్ రాజ్ ప్యానెల్లో లేరు. ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. కానీ ఈ ప్యానెల్‌కు మద్దతు ఇస్తున్నారు. కాగా తాను ప్రకాష్ రాజ్ అండ్ కోకు ఎందుకు మద్దతు ఇస్తున్నది నాగబాబు వెల్లడించారు. అంతే కాక ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కు చిరంజీవి మద్దతు ఇస్తారని కూడా నాగబాబు ప్రకటించడం విశేషం. ఇంకా ఈ విషయమై నాగబాబు ఏమన్నారంటే..

రెండు నెలల కిందటే ప్రకాష్ రాజ్ తన దగ్గరికొచ్చి ‘మా’లో పరిస్థితుల గురించి మాట్లాడాడని.. ‘మా’ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ఏం చేయాలో వివరించారని.. ఆయన మాటలు విన్నాక తనకు నమ్మకం కలిగిందని నాగబాబు చెప్పారు. ప్రకాష్ రాజ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి ముచ్చట పడ్డానని.. ‘మా’ కోసం కూడా ఆయన ఎంతో చేస్తారనిపించిందని ఆయనన్నారు. ప్రకాష్ రాజ్ ‘నాన్ లోకల్’ అనే వాదనలో అర్థం లేదని.. ‘మా’లో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో ఏ పదవి కోసమైనా పోటీ చేసే హక్కు ఉందని.. ప్రకాష్ రాజ్ ఇక్కడే సెటిలై ఇక్కడి గ్రామాలను దత్తత తీసుకుని సేవ చేస్తున్నారని నాగబాబు చెప్పారు.

ప్రకాష్ రాజ్‌లో సేవాగుణం, ‘మా’ కోసం ఆయన వేసిన ప్రణాళికలు చూసి తన మద్దతు ఇవ్వాలనుకున్నానని.. ఒకరకంగా చెప్పాలంటే అన్నయ్య చిరంజీవి ఆశీస్సులు కూడా ఆయనకు ఉన్నాయని. ప్రకాశ్‌రాజ్‌ ప్లానింగ్‌ గురించి అన్నయ్యతో చెప్పినప్పుడు “ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నేను సపోర్ట్‌ చేస్తాను” అని అన్నట్లు నాగబాబు వెల్లడించారు.