రాధేశ్యామ్.. ఓ పనైపోతుంది బాబూ

లాక్ డౌన్-2 విరామానికి ముందు ప్రభాస్ సినిమాలు మూడు సెట్స్ మీద వివిధ దశల్లో ఉన్నాయి. అవే.. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్. మొదటి సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండగా.. రెండోది మధ్య దశలో ఉంది. చివరి చిత్రం షూటింగ్ కొన్ని రోజులు మాత్రమే జరిగింది. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేసి షూటింగ్‌కు అనుమతులు లభించిన నేపథ్యంలో ఆ మూడు చిత్రాల బృందాలూ ప్రభాస్ కోసం ఎదురు చూస్తున్నాయి.

ముందుగా ప్రభాస్ ‘ఆదిపురుష్’ పని మొదలుపెడతాడని ఇంతకుముందు వార్తలు రాగా.. ఆ తర్వాత ‘సలార్’ కోసం పని చేస్తాడని ప్రచారం సాగింది. తర్వాతేమో ‘రాధేశ్యామ్’ షూటింగ్ పున:ప్రారంభిస్తున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఐతే బ్రేక్ తర్వాత ప్రభాస్ ఏ సినిమా పని మొదలుపెడుతున్నాడో ఇప్పుడు స్పష్టత వచ్చేసింది. షూటింగ్ చివరి దశలో ఉన్న ‘రాధేశ్యామ్’ సెట్లోకే ప్రభాస్ అడుగు పెట్టాడు.

‘రాధేశ్యామ్’ కొత్త షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు హీరోయిన్ పూజా హెగ్డే శుక్రవారం అప్‌డేట్ ఇచ్చింది. ఆమె షూటింగ్‌లో అడుగు పెట్టిందంటే ఆటోమేటిగ్గా ప్రభాస్ కూడా వస్తున్నట్లే. ఈ సినిమా చిత్రీకరణ ఇంకో రెండు మూడు వారాలే మిగిలి ఉంది. అది కాన్చిచ్చేస్తే ప్రభాస్ పనైపోతుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే మిగిలుంటుంది. మధ్యలో కొంచెం వీలు చేసుకుని డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఈ సినిమా షూటింగ్ ముందుగా పూర్తి చేసి ఓ పనైపోయింది అనిపించాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లుంది.

దీని తర్వాత ప్రభాస్ సమాంతరంగా ‘సలార్’, ‘ఆదిపురుష్’ చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటాడని తెలుస్తోంది. ‘రాధేశ్యామ్’ను జులై నెలాఖర్లో రిలీజ్ చేయాలని ఇంతకుముందు అనుకున్నారు. కానీ ఇప్పుడు అది సాధ్యపడేలా లేదు. ఇప్పుడు దాని మేకర్స్ దసరా రిలీజ్ మీద దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో పరిస్థితులను బట్టి ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది.