టాలీవుడ్ పెళ్లిళ్లపై హీరోయిన్ కౌంటర్?

లాక్ డౌన్ ఎంతకీ ముగియకపోవడంతో పెళ్లిళ్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్లు ఇక లాభం లేదని రంగంలోకి దిగేస్తున్నారు. పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య వేడుకలు జరిపించేస్తున్నారు.

ఇందుకు సినిమా వాళ్లు కూడా మినహాయింపు కాదు. అగ్ర నిర్మాత దిల్ రాజు ఇటీవలే తన స్వస్థలంలో రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక సరిగ్గా పెళ్లి చేసుకుందాం అనుకున్న సమయానికే లాక్ డౌన్ రావడంతో ఒకటికి రెండుసార్లు పెళ్లిని వాయిదా వేసుకున్న నిఖిల్ సిద్దార్థ కూడా.. మొన్ననే హైదరాబాద్‌లో పల్లవి వర్మను పెళ్లాడేశాడు.

నితిన్ సైతం త్వరలోనే పెళ్లి తంతును ముగించేద్దామనుకుంటుండగా.. మరోవైపు దగ్గుబాటి రానా పెళ్లికి కూడా సన్నాహాలు మొదలయ్యాయి. ఐతే లాక్ డౌన్ టైంలో ఇలా హడావుడిగా పెళ్లిళ్లు చేసుకోవడాన్ని ఒక హీరోయిన్ తప్పుబట్టడం గమనార్హం. ఆ హీరోయిన్.. మాధవీ లత.

‘నచ్చావులే’, ‘స్నేహితుడా’ సహా కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత సైడ్ అయిపోయిన మాధవీలత.. సెన్సేషనల్ యూట్యూబ్ ఇంటర్వ్యూలతో మళ్లీ హైలైట్ అయింది. ఆపై ఆమె భారతీయ జనతా పార్టీలో చేరి వాయిస్ వినిపిస్తోంది. తరచుగా సెన్సేషనల్ కామెంట్స్ చేసే మాధవి.. టాలీవుడ్ లాక్ డౌన్ పెళ్లిళ్లపై కౌంటర్లు వేసింి. ‘‘ముహూర్తం మళ్లీ రాదా? ఇప్పుడు కాకపోతే ఇంకో ఏడాదికి పెళ్లి చేసుకోవచ్చు కదా. పిల్ల దొరకదా? పిల్లోడు మారిపోతాడా? అలా మారిపోయే మనుషులతో బంధాలు ఎందుకు? మాస్కుల ముసుగులతో పెళ్లి అవసరమా? పెళ్లి కోసం కొన్నాళ్లు ఆగలేని వాళ్లు.. తర్వాత సరిగ్గా సంసారం చేస్తారా’’ అంటూ కౌంటర్లు వేసింది మాధవీలత.

ఆమె అందరినీ ఉద్దేశించే ఈ మాట అందేమో కానీ.. మాజీ హీరోయిన్ కావడంతో సినిమా వాళ్లకే ఆ కౌంటర్లు గట్టిగా తాకుతున్నాయి. ఐతే సినిమాల్లో మాధవికి ఏమాత్రం వాల్యూ లేకపోవడంతో ఆమె వ్యాఖ్యల్ని ఎవరైనా పట్టించుకుంటారా అన్నది సందేహమే.