చిన్న కుర్రాడికి పెద్ద ఛాన్స్

టాలీవుడ్లో బాల నటుడిగా తరుణ్ తర్వాత ఆ స్థాయిలో సినిమాలు చేసి, పేరు సంపాదించిన నటుడంటే తేజ సజ్జానే. ‘ఇంద్ర’ లాంటి భారీ చిత్రం సహా 60-70 చిత్రాల్లో అతను నటించడం విశేషం. చిరంజీవి సహా నిన్నటి తరం స్టార్లందరితోనూ అతను స్క్ర్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆ అనుభవం అతడికి బాగానే పనికొచ్చింది. చదువు పూర్తి చేసుకుని మళ్లీ సినిమాల్లోకి రావాలనుకున్నపుడు ‘ఓ బేబీ’ లాంటి పేరున్ చిత్రంలో కీలక పాత్ర దక్కింది. అందులో సత్తా చాటుకుని ‘జాంబీ రెడ్డి’తో హీరోగా అరంగేట్రం చేశాడు.

ఆ సినిమా మంచి విజయమే సాధించింది. తేజకు కూడా బాగానే పేరొచ్చింది. మంచి ఈజ్‌తో కనిపించాడతను. ‘ఇష్క్’ పేరుతో అతను హీరోగా మరో చిన్న సినిమా కూడా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అది విడుదలకు సిద్ధంగా ఉంది. తేజకు మంచి ఫ్రెండ్ అయిన ‘జాంబీ రెడ్డి’ దర్శకుడు ప్రశాంత్.. తనతో మరో సినిమా తీసే ఆలోచనలో ఉన్నాడు.

ఇంతలో తేజకు ఇప్పుడు ఓ పెద్ద బేనర్లో అవకాశం దక్కినట్లు సమాచారం. వైజయంతీ మూవీస్‌-స్వప్న సినిమా ఉమ్మడిగా తెరకెక్కించనున్న ఓ ప్రయోగాత్మక చిత్రంలో తేజ హీరోగా నటించనున్నాడట. ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తాడట. తేజ ఇప్పటిదాకా చేసిన చేసిన చిత్రాలతో పోలిస్తే ఇది పెద్ద అవకాశమే. వైజయంతీ బేనర్ ఇప్పుడు మంచి జోరు మీద ఉంది. ప్రభాస్‌తో భారీ చిత్రాన్ని లైన్లో పెట్టిన ఈ సంస్థ.. మరోవైపు చిన్న సినిమాలతోనూ సత్తా చాటుతోంది.

ఇటీవలే ‘జాతిరత్నాలు’తో మంచి విజయం దక్కిందీ సంస్థకు. చిన్న సినిమాలను ‘స్వప్న సినిమా’ పేరుతో తెరకిక్కిస్తున్నప్పటికీ అది వైజయంతీలో అంతర్భాగమే. ప్రస్తుతం ఈ సంస్థలో తెరకెక్కుతున్న చిన్న సినిమాలను నాగ్ అశ్విన్, స్వప్న, ప్రియాంకలే పర్యవేక్షిస్తున్నారు. నాగ్ అశ్విన్ హ్యాండ్ వారికి బాగా కలిసొస్తోంది. వీళ్ల అండలో తేజ బాగానే షైన్ కావడానికి అవకాశముంటుండదనడంలో సందేహం లేదు.