సుక్కు మహేష్‌తో అనుకున్నది.. చిరుతో సంపత్

‘1 నేనొక్కడినే’ తర్వాత మహేష్ బాబుతో రెండో సినిమా చేయాలని అనుకున్నపుడు సుకుమార్ ముందుగా అనుకున్న కథ.. తెలంగాణ రజాకార్లపై సాగిన సాయుధ పోరాటం నేపథ్యంలో కావడం విశేషం. ఈ పోరాటం మీద సుక్కు చాలా పుస్తకాలు చదివారు. కొన్ని నెలల పాటు పరిశోధన కూడా జరిపారు. ఐతే ఆ కథ మహేష్‌కు సూట్ కాదని తర్వాత వెనక్కి తగ్గారు.

ఆపై ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథ రెడీ చేసుకున్నారు. అనివార్య కారణాల వల్ల అది కూడా మహేష్‌తో వర్కవుట్ కాలేదు. ఈ కథను అల్లు అర్జున్‌తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఐతే భవిష్యత్తులో తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో సుక్కు సినిమా తీసే అవకాశాలైతే మెండుగా ఉన్నాయి. ఐతే ఈలోపు మరో దర్శకుడు ఈ కథ మీద వర్క్ చేస్తున్నట్లు చెప్పడం విశేషం. మెగాస్టార్ చిరంజీవితో ఆ సినిమా చేయాలనుకుంటున్న దర్శకడు సంపత్ నంది కావడం విశేషం.

చిరు తనయుడు చరణ్‌తో ‘రచ్చ’ లాంటి హిట్ తీసిన సంపత్.. పవన్‌తో ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ చేయాల్సింది కానీ.. అది వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం అతను గోపీచంద్‌తో ‘సీటీ మార్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఆ చిత్ర షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సంపత్.. తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి వివరించాడు.

తాను తెలంగాణ రజాకార్ల నేపథ్యంలో పరిశోధన జరిపి ఓ కథ తయారు చేస్తున్నానని.. ఆ కథను చిరంజీవితో చేయాలన్నది తన కల అని సంపత్ చెప్పాడు. ఇక పవన్‌తో మళ్లీ పని చేస్తారా అని అడిగితే.. తప్పకుండా చేస్తానని సంపత్ తెలిపాడు. ఇప్పటికే పవన్ కోసం ఓ కథ తయారు చేశాని.. ‘సీీటీ మార్’ రిలీజ్ తర్వాత వెళ్లి పవన్‌కు స్టోరీ చెబుతానని అతనన్నాడు. ‘సీటీ మార్’ చిత్రీకరణ 40 శాతం పూర్తయిందని.. వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజవుతుందని తెలిపాడు.