బాలీవుడ్ లో పెను తుఫాన్ మొదలవ్వనుంది

దేశంలో లాక్‌డౌన్ విధించి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా, కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. అయినా టాలీవుడ్ నిర్మాతలు లో-బడ్జెట్, మీడియం బడ్జెట్ సినిమాలనే నేరుగా ఓటీటీ రిలీజ్ చేయడానికి ఏ మాత్రం ఇష్టపడడం లేదు. నాని, సుధీర్ ‘వీ’ సినిమాకు రూ.30 కోట్లు ఆఫర్ చేసినా, సున్నితంగా తిరస్కరించాడట నిర్మాత ‘దిల్’ రాజు. అలాంటిది బాలీవుడ్‌లో మాత్రం లాక్‌డౌన్ పుణ్యమాని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో పెను తుఫాన్ మొదలుకాబోతోంది. బడ్జెట్‌తో సంబంధం లేకుండా స్టార్ హీరోల సినిమాలు కూడా నేరుగా ఓటీటీ రిలీజ్ కాబోతున్నాయి.

రాఘవ లారెన్స్ స్వీయదర్శకత్వంలో రూపొందిన ‘కాంచన’ రీమేక్‌గా అక్షయ్ కుమార్‌తో తెరకెక్కించిన ‘లక్ష్మీ బాంబ్’ మూవీ, త్వరలో ఓటీటీ రిలీజ్ కానుంది. ఇంకా డేట్ ఫిక్స్ కాకపోయినా దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ‘లక్ష్మీ బాంబ్’ చిత్రాన్ని త్వరలో హాట్ స్టార్‌లో రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫార్మ్ అయ్యింది. వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న అక్షయ్ కుమార్ కూడా థియేటర్ రిలీజ్ కోసం ఆగకుండా నేరుగా ఓటీటీ రిలీజ్ చేస్తుండడంతో మిగిలిన నిర్మాతలు కూడా సాహసం చేస్తున్నారు.

అమితాబ్, అయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటించిన ‘గులాబో సితాబో’ జూన్ 12న అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అవుతుంటే… నవాజుద్దీన్ సిద్ధికీ ‘గూమ్‌కేకు’ సినిమాను జీ5లో మే22న డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీ నటించిన ‘షేర్ షా’ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేస్తుంటే… విద్యా బాలన్ ‘శకుంతల దేవి’, జాన్వీ కపూర్‌తో కరణ్ జోహార్ నిర్మించిన ‘గుంజాన్ సక్సేనా- ది కార్గిల్ గర్ల్’, అమితాబ్ బచ్చన్ ‘జుండ్’, ఇమ్రాన్ హష్మీ ‘చెహ్రే’ సినిమాలు త్వరలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో దర్శనమివ్వబోతున్నాయి.

బడ్జెట్‌తో సంబంధం లేకుండా చిన్నాపెద్ద సినిమాలన్నీ ఓటీటీ రిలీజ్‌కు పోటీపడుతుండడంతో ఒకవేళ లాక్‌డౌన్ తర్వాత థియేటర్లు ఓపెన్ చేసినా… రిలీజ్ చేయడానికి కొత్త సినిమాలేవీ మిగలకపోవచ్చు. బాలీవుడ్ స్టార్లను చూసి మనవాళ్లు కూడా ఓటీటీ రిలీజ్‌కు ఇంట్రెస్ట్ చూపిస్తారేమో చూడాలి.