ఆదిపురుష్.. మొత్తం ప్లాన్ మారిపోయింది


‘బాహుబలి’ దగ్గర్నుంచి ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజిదే. ఐతే బాహుబలి అయినా.. ఆ తర్వాత చేసిన సాహో, రాధేశ్యామ్ అయినా బేసిగ్గా తెలుగు చిత్రాలే. ‘సలార్’ కూడా అంతే. ప్రాథమికంగా తెలుగులో తీసి, ఆ తర్వాత మిగతా భాషల్లోకి వాటిని విస్తరిస్తున్నారు. కానీ ‘ఆదిపురుష్’ అలా కాదు. అది బేసిగ్గా హిందీ సినిమా. దాన్ని తెరకెక్కిస్తున్నది బాలీవుడ్ దర్శకుడు. నిర్మాతలూ అక్కడి వాళ్లే. ముందుగా హిందీలో తీసి, ఆ తర్వాత ఇతర భాషల్లో డైలాగులు చెప్పించడం, లేదా అనువాదం చేయడం లాంటివి చేయబోతున్నారు.

అందుకనే ఈ చిత్రానికి బేస్ కూడా ముంబయిలోనే ఏర్పాటు చేసుకున్నారు. స్టూడియోలు, సెట్టింగులు అన్నీ కూడా అక్కడే ఏర్పాటయ్యాయి. ముంబయిలో ఒక పెద్ద స్టూడియోలో పెద్ద ఎత్తున ఫ్లోర్లు అద్దెకు తీసుకుని సెట్టింగ్స్ వేశారు. అలాగే ముంబయిలో సముద్రం పక్కన ఒక దీవి లాంటిది చూసుకుని అక్కడా షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ వీరి ప్రణాళికలకు కరోనా అడ్డం పడింది. నెలలకు నెలలు ఎదురు చూసినా కూడా ముంబయిలో ఎక్కడా షూటింగ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు.

దీంతో ఇక లాభం లేదని ‘ఆదిపురుష్’ టీం తమ బేస్‌ను హైదరాబాద్‌కు మార్చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు వేస్ట్ అయినా పర్వాలేదని.. మొత్తం టీం అంతా హైదరాబాద్‌కు వచ్చేయబోతోందట. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో, వేరే చోట్ల సెట్టింగ్స్ వేసుకుని షూటింగ్ చేసుకోవడానికి డిసైడైందట. మూడు నెలల పాటు అందరూ ఇక్కడే ఉండి మేజర్ షెడ్యూల్స్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట. ఇందుకోసం ప్రస్తుతం బ్యాగ్రౌండ్ వర్క్ నడుస్తున్నట్లు సమాచారం. కరోనా ఉద్ధృతి కొంచెం తగ్గాక ఇక్కడ ‘ఆదిపురుష్’ షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు.