కన్నీళ్లు పెట్టిస్తున్న ఇర్ఫాన్ భార్య పోస్టు

దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకడైన ఇర్ఫాన్ ఖాన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి అప్పుడే ఏడాది అయిపోయిందంటే ఆయన అభిమానులకు నమ్మశక్యంగా అనిపించడం లేదు. కొన్నేళ్ల కిందటే అరుదైన క్యాన్సర్ బారిన పడి.. దాంతో రెండు మూడేళ్ల పాటు పోరాటం చేసి, చివరికి గత ఏడాది ఇండియాలో లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో, ఏప్రిల్ 29న తుది శ్వాస విడిచాడు ఇర్ఫాన్. మామూలు రోజుల్లో అయితే ఇర్ఫాన్‌ను చూడటానికి వేలాది మంది వచ్చేవాళ్లు. కానీ కరోనా నేపథ్యంలో అతడికి ఘనమైన వీడ్కోలు కూడా దక్కలేదు.

సామాజిక మాధ్యమాల్లో మాత్రం అభిమానులు ఇర్ఫాన్‌కు ఘనమైన నివాళే అర్పించారు. ఐతే అభిమానులు, బయటి వారు ఆ సమయానికి బాధ పడి.. ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయేవాళ్లే. కానీ కుటుంబ సభ్యుల బాధ మాత్రం ఎప్పటికీ తీరేది కాదు. ఇప్పుడు ఆ బాధనే అక్షర రూపంలోకి తెచ్చింది ఇర్ఫాన్ భార్య సుతాపా సిక్దర్.

ఇర్ఫాన్ తొలి వర్ధంతి నేపథ్యంలో సుతాపా ఒక హృద్యమైన పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఇర్ఫాన్ లేని జీవితం ఎంత బాధాకరంగా ఉందో వివరించింది. తనకు కానీ, ఇర్ఫాన్‌కు కానీ ఎక్కువమంది స్నేహితులు లేరని… తమకు ఏమాత్రం ఖాళీ దొరికినా ఒకరితో ఒకరు గడిపేవాళ్లమని.. ఇర్ఫాన్ చాలా సమయం షూటింగ్‌లకే కేటాయించినా, అందులోంచి ఖాళీ అవ్వగానే తనతోనే గడిపేవాడని.. అందుకే అతను లేని జీవితం చాలా కష్టంగా గడుస్తోందని సుతాపా పేర్కొంది.

ఇర్ఫాన్ చనిపోవడానికి రెండు నెలల ముందు తాము హాలిడే ప్లాన్ చేసుకున్నామని.. ఐతే ఇర్ఫాన్‌‌ను మృత్యువు ఎప్పుడైనా పలకరించవచ్చని డాక్టర్ చెప్పారని, అయినా సరే హాలిడేకు వెళ్లాలనుకున్నామని.. కానీ ఈ లోపే అతను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడని అంది సుతాపా. ఇర్ఫాన్ తన చుట్టూనే ఉన్నట్లు ఇప్పటికీ అనిపిస్తోందంటూ ఉద్వేగానికి గురైంది సుతాపా.