‘రాధేశ్యామ్’ షూటింగ్ ఎలా ఆగింది?

టాలీవుడ్లో చాలా సినిమాల షూటింగ్స్‌కు మళ్లీ బ్రేకులు పడుతున్నాయి. కరోనా ప్రభావం ఉండగానే ఇన్నాళ్లూ షూటింగ్ జరిగాయి. ఇప్పుడు వైరస్ ప్రభావం పెరిగింది. అయినా సరే.. జాగ్రత్తల మధ్య షూటింగ్ కొనసాగిద్దామని చూసినా పరిస్థితులు ఏమాత్రం సహకరించట్లేదు. పెద్ద ఎత్తున యూనిట్లలో కేసులు బయటపడుతుండటం, అలాగే యూనిట్లో కీలక వ్యక్తులు భయపడుతుండటంతో షూటింగ్స్ వాయిదా వేయక తప్పట్లేదు.

సర్కారు వారి పాట, ఆచార్య లాంటి భారీ చిత్రాల షూటింగ్స్ ఇటీవల ఆపేసిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే ‘రాధేశ్యామ్’ బ్యాలెన్స్ టాకీ పార్ట్ చిత్రీకరణకు అన్ని ఏర్పాట్లూ చేశాక.. వెనకడుగు వేయక తప్పట్లేదు. సలార్, ఆదిపురుష్ చిత్రాల్లో నటిస్తున్న ప్రభాస్ అతి కష్టం మీద కొంచెం వీలు చేసుకుని ‘రాధేశ్యామ్’కు కాల్ షీట్స్ ఇచ్చాడు. పది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో దాన్ని పూర్తి చేసి ఒక పనైపోయింది అనిపించాలని ప్రభాస్ అనుకున్నాడు.

కానీ ‘రాధేశ్యామ్’ షూటింగ్ అనుకున్నట్లుగా జరగలేదు. ఆగిపోయింది. ఐతే ప్రస్తుతం కొవిడ్ విజృంభణ నేపథ్యంలో హీరోయిన్ పూజా హెగ్డే తాను షూటింగ్‌కు రాలేనని ఖరాఖండిగా చెప్పేసిందని.. అందుకే ‘రాధేశ్యామ్’ టీం ఏమీ చేయలేకపోయిందని మీడియాలో వార్తలొచ్చాయి. ప్రభాస్ అంత పెద్ద స్టారే రెడీ అయినపుడు పూజాకు ఏమొచ్చిందంటూ కొందరు ఆమెను నిందించడం మొదలుపెట్టారు. కానీ పూజా వల్లే ‘రాధేశ్యామ్’ షూటింగ్ ఆగిందనడంలో వాస్తవం లేదని సమాచారం. ప్రభాస్ మేకప్ మ్యాన్‌ కరోనా బారిన పడటంతోనే షూటింగ్ మొదలుపెట్టినట్లే పెట్టి ఆపేశారని తెలిసింది.

ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే. మేకప్ చాలా కీలకం. సినిమా అంతటా ఒక కంటిన్యుటీ ఉండాలి. ఇప్పటికప్పుడు వేరే మేకప్ మ్యాన్‌ను తీసుకోవడం కష్టమని, ఎలాగూ కరోనా ప్రభావం ఉద్ధృతంగా ఉండటంతో ఇప్పుడు షూటింగ్ చేయడం కూడా కరెక్ట్ కాదని టీం వెనక్కి తగ్గిందట. అంతకుమించి కారణాలేవీ తెలుస్తోంది.