బండ్ల గ‌ణేష్ సేఫ్‌

క‌రోనా సెకండ్ వేవ్ ఎలా విజృంభిస్తోందో.. మ‌ళ్లీ ప‌రిస్థితులు ఎంత ప్ర‌మాద‌క‌రంగా మారుతున్నాయో తెలిసిందే. వాస్త‌వంగా చెప్పాలంటే గ‌త ఏడాది ఇదే స‌మయానికి క‌రోనా తీవ్ర‌త ఇంత‌కంటే త‌క్కువ‌గా ఉన్నా జ‌నాలు వ‌ణికిపోయారు. కానీ ఇప్పుడు తొలి ద‌శ‌ను మించి క‌రోనా విజృంభిస్తోంది. దేశంలో రోజువారీ కేసులు రెండు ల‌క్ష‌ల దాకా ఉంటున్నాయి. మ‌ర‌ణాలు వెయ్యికి త‌గ్గ‌ట్లేదు. అయినా జ‌నాల్లో భ‌యం క‌నిపించ‌డం లేదు.

తొలి ద‌శ‌లో క‌రోనా బారిన ప‌డి కోలుకున్న వారికి.. అలాగే వ్యాక్సినేష‌న్ చేయించుకున్న వారికి కూడా వైర‌స్ సోకుతుండ‌టం ఆందోళ‌న పెంచుతోంది. నిరుడు క‌రోనా సోకినా పెద్ద‌గా ఇబ్బంది ప‌డ‌కుండా కోలుకున్న సినీ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్‌.. ఇటీవ‌ల మ‌ళ్లీ క‌రోనా పాజిటివ్‌గా తేల‌డం, గ‌తంతో పోలిస్తే ఈసారి తీవ్ర‌త ఎక్కువ కావ‌డం తెలిసిందే.

కొన్ని రోజుల కింద‌టే గ‌ణేష్‌ను ఐసీయూలో చేర్చాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఆయ‌న‌కు శ్వాస కోశ స‌మ‌స్య‌లు కూడా తీవ్ర‌మ‌య్యాయి. దీంతో గ‌ణేష్ స‌న్నిహితులు, అభిమానులు భ‌య‌ప‌డిపోయారు. ఐతే గ‌ణేష్ ప్రాణాపాయం త‌ప్పించుకోవ‌డంతో ఇప్పుడు అంద‌రూ ఊపిరి పీల్చుకుంటున్నారు. వైర‌స్ ప్ర‌భావం త‌గ్గ‌డం, మ‌రీ ఇబ్బందులేమీ లేక‌పోవ‌డంతో తాజాగా గ‌ణేష్‌ను ఐసీయూ నుంచి సాధార‌ణ గ‌దికి మార్చిన‌ట్లు స‌మాచారం.

హైద‌రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుప‌త్రిలో బండ్ల గ‌ణేష్‌కు చికిత్స జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే అత‌ను ఇంటికి చేరుకుంటాడ‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల వ‌కీల్ సాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో త‌న‌దైన శైలిలో బ్లాక్ బ‌స్ట‌ర్ స్పీచ్ ఇచ్చి అంద‌రి దృష్టిలో ప‌డ్డాడు బండ్ల‌. ఆ వేడుక‌లోనే అత‌డికి క‌రోనా సోకి ఉంటుంద‌ని భావిస్తున్నారు. వ‌కీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు.. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌క్తిగ‌త సిబ్బందిలోనూ చాలామంది క‌రోనా బారిన ప‌డ్డ సంగతి తెలిసిందే.