‘దృశ్యం-2’.. వెంకీని సవాల్ చేసేది ఆయనే

మలయాళంలో చడీచప్పుడు లేకుండా మొదలై.. పెద్దగా హైప్ లేకుండా విడుదలై అద్భుతమైన స్పందన తెచ్చుకున్న సినిమా ‘దృశ్యం-2’. ఐదేళ్ల కిందట వివిధ భాషల్లో సంచలన విజయం సాధించిన ‘దృశ్యం’కు సీక్వెల్‌గా ఒరిజినల్ డైరెక్టర్ జీతు జోసెఫే ఈ చిత్రాన్ని కూడా రూపొందించాడు. మోహన్ లాల్, మీనాలే సీక్వెల్లోనూ ప్రధాన పాత్రలు పోషించారు. అంతే కాక మోహన్ లాల్ కూతుళ్లుగా.. నెగెటివ్ రోల్ చేసిన వరుణ్ తల్లిదండ్రులుగా ‘దృశ్యం’లో కనిపించిన వాళ్లే ఇందులోనూ నటించారు.


సినిమాలో ఆరేళ్ల తర్వాత పరిస్థితులకు తగ్గట్లు కథ నడుస్తుంది. నటీనటులను కూడా వాళ్లనే తీసుకోవడం సీక్వెల్ అన్న మాటకు సరైన అర్థంగా నిలిచింది ‘దృశ్యం-2’. ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోనూ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో కూడా సాధ్యమైనంతగా ‘దృశ్యం’లో నటించిన నటీనటులనే తీసుకున్నారు. ‘దృశ్యం-2’ లొకేషన్లో తీసిన ఒక ఫొటోను బట్టి ఈ విషయం స్పష్టమవుతోంది.

వెంకీ సరసన మీనా నటిస్తుండగా.. వీరి కూతుళ్లుగా ‘దృశ్యం-’లో నటించిన కృతిక జయకుమార్, ఎస్తేర్ అనిల్‌లే కనిపించనున్నారు. ఫస్ట్ పార్ట్‌లో వరుణ్ తల్లిదండ్రులుగా నటించిన నదియా, నరేష్‌లు ఈ సినిమాలోనూ కొనసాగనున్నారు.

ఇక మ‌ల‌యాళంలో దృశ్యం-2లో హైలైట్‌గా నిలిచిన ఐజీ పాత్ర‌లో అక్క‌డ ముర‌ళీ గోపి స‌టిల్ పెర్ఫామెన్స్‌తో అద‌ర‌గొట్ట‌గా.. తెలుగులో ఆ పాత్ర కోసం త‌మిళ న‌టుడు సంప‌త్‌ను తీసుకున్నారు. ఇలాంటి పాత్ర‌లు ఆయ‌న‌కు కొట్టిన పిండి. కాబ‌ట్టి జీతు జోసెఫ్ మంచి ఛాయిస్ తీసుకున్న‌ట్లే. వెంకీ-సంప‌త్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాలో హైలైట్ అయ్యే అవ‌కాశాలున్నాయి. ఈ ఆన్ లొకేష‌న్ ఫొటో ద్వారా సినిమాలో వెంకీ లుక్ కూడా బ‌య‌టికి వ‌చ్చేసింది. ఒరిజిన‌ల్లో మోహ‌న్ లాల్ లాగే గ‌డ్డంతో సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడు వెంకీ. ఆయ‌న నార‌ప్ప త‌ర్వాత గ‌డ్డంతో క‌నిపించ‌నున్న మ‌రో సినిమా ఇది.