కరోనా ఉన్నా షూటింగ్.. రచ్చ రచ్చ

మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ మూవీలో సూపర్ హిట్టయిన ‘నా పేరే కాంచనమాల’ పాటలో నటించిన అమ్మాయి గుర్తుందా? బాలీవుడ్‌కు చెందిన ఈ భామ పేరు గౌహర్ ఖాన్. ఇప్పుడీ అమ్మాయి వ్యవహారం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. గౌహర్‌ కరోనా పాజిటివ్‌గా తేలినప్పటికీ షూటింగ్‌లో పాల్గొందంటూ ఆమెపై ముంబయి పోలీసులు కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ విషయమై మీడియాకు ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు.

‘‘కరోనా సోకిన వ్యక్తి పాటించాల్సిన మార్గనిర్దేశకాలను గౌహర్ ఖాన్ పాటించలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మాకు ముంబయి సిటీ క్షేమం ప్రధానం. నిబంధనలు అందరికీ ఒకే రకంగా ఉంటాయి. అందుకే గౌహర్ ఖాన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. కరోనా విషయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి’’ అని ఆ ప్రెస్ నోట్లో ముంబయి పోలీసులు పేర్కొన్నారు.

కరోనా ఉన్నా కూడా గౌహర్ ఖాన్ ఎలా షూటింగ్‌లో పాల్గొందంటూ సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. సహచరుల ప్రాణాలు రిస్క్‌లో పెట్టడం సమంజసమేనా అన్న ప్రశ్నలు తలెత్తాయి. కానీ ఆమె నటిస్తున్న సినిమాకు సంబంధించిన యూనిట్ మాత్రం పోలీసుల ఆరోపణలను ఖండించింది.

గౌహర్ ఖాన్‌కు కరోనా నెగెటివ్ వచ్చాకే షూటింగ్‌లో పాల్గొన్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. గౌహర్ తీవ్ర మానసిక వేదనలో ఉన్నట్లు పేర్కొంది. పది రోజుల కిందటే గౌహర్ తండ్రి చనిపోయారని.. దానికి సంబంధించిన విషాదంలో ఉండగా ఈ ఆరోపణలు ఆమెను మరింత కుంగదీస్తున్నాయని చిత్ర బృందం వివరించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే గౌహర్ నడుచుకుంటోందని.. ఆమెపై అనవసర అభాండాలు వేయొద్దని చిత్ర యూనిట్ కోరింది. ఐతే దీనిపై గౌహర్ మాత్రం ఏమీ స్పందించట్లేదు. ఆమె వివరణ కోసం మీడియా వాళ్లు ప్రయత్నించినా స్పందించలేదు.