ముగ్గురికీ చావోరేవోనే.. బయట పడేదెవరో?

విజయాలకు ముఖం వాచిపోయిన ముగ్గురు యువ కథానాయకులు.. బాక్సాఫీస్ దగ్గర అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ ముగ్గురూ ఇప్పుడు చావోరేవో అన్న పరిస్థితుల్లో ఉండటం గమనార్హం. వారి సినిమాలు మూడూ ఒకే రోజు రిలీజవుతున్నాయి. ఆ హీరోలు మంచు విష్ణు, ఆది సాయికుమార్, కార్తికేయ గుమ్మకొండ కాగా.. ఈ శుక్రవారం రిలీజ్ కానున్న వారి సినిమాలు మోసగాళ్ళు, శశి, చావు కబురు చల్లగా.

వీరిలో అత్యంత కష్టకాలంలో ఉన్నది మంచు విష్ణునే అని చెప్పాలి. కెరీర్లో ఆరంభంలో కొన్నేళ్ల పాటు బాగా స్ట్రగులైన విష్ణు.. తర్వాత ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా లాంటి చిత్రాలతో అడపాదడపా కొన్ని హిట్లు కొట్టాడు. కానీ ‘దూసుకెళ్తా’ తర్వాత అతడికి విజయమే లేదు. దాని తర్వాత అతడి నుంచి చాలా సినిమాలొచ్చాయి. పోయాయి. చివరగా విష్ణు నుంచి వచ్చిన ‘ఓటర్’ సంగతేమైందో చెప్పాల్సిన పని లేదు. ఈ స్థితిలో బాగా గ్యాప్ తీసుకుని ‘మోసగాళ్ళు’ సినిమా చేశాడు. విష్ణు గత సినిమాల ప్రభావం ఏమీ లేకుండా ఈ సినిమా బాగానే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంతో కచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతానని విష్ణు ధీమాగా ఉన్నాడు.

ఇక ఆది విషయానికి వస్తే.. కెరీర్ ఆరంభంలో ప్రేమ కావాలి, లవ్లీ లాంటి యావరేజ్ సినిమాలతో పర్వాలేదనిపించాడు. కానీ తర్వాత వచ్చిన చిత్రాలన్నీ తీవ్ర నిరాశకు గురి చేశాయి. చివగరా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’తో షాక్ తిన్నాడతను. ఇప్పుడు అతడి అన్ని ఆశలూ ‘శశి’ మీదే ఉన్నాయి. ఒకే ఒక లోకం నువ్వే పాటతో ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆది గత సినిమాలతో పోలిస్తే మెరుగైన సినిమా లాగే ఉంది ‘శశి’.

ఈ ఇద్దరితో పోలిస్తే కార్తికేయ పరిస్థితి కొంచెం నయం. అతను ‘ఆర్ఎక్స్ 100’తో పెద్ద బ్లాక్‌బస్టర్ అందుకున్నాక గత రెండేళ్లలో అరడజను సినిమాల దాకా చేశాడు. కానీ ఏదీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. సినిమా సినిమాకూ క్రేజ్ తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో ‘చావు కబురు చల్లగా’తో అతను సత్తా చాటక తప్పని పరిస్థితి నెలకొంది. మరి ఈ మూడు చిత్రాలూ ఈ ముగ్గురు హీరోలు బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేస్తాయేమో చూడాలి.