హిట్ సీక్వెల్.. సస్పెన్సులో పెట్టేసిన నాని

గతంలో ‘డి ఫర్ దోపిడి’ అనే సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించిన నాని.. కొన్నేళ్ల కిందటే ‘అ!’ సినిమాతో పూర్తి స్థాయి నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. దాని తర్వాత అతడి వాల్ పోస్టర్ సినిమా నుంచి వచ్చిన కొత్త చిత్రం ‘హిట్’. శైలేష్ కొలను అనే కొత్త దర్శకుడు విశ్వక్సేన్ హీరోగా ఈ చిత్రాన్ని రూపొందించాడు.

మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. ఆ అంచనాలను అందుకుంది. తెలుగులో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. నానికి నిర్మాతగా ఇదే అతి పెద్ద విజయం. ఈ సినిమా విడుదలై ఆదివారం నాటికి సరిగ్గా ఏడాది అయింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ట్వీట్ వేశాడు నాని. చాన్నాళ్ల నుంచి ప్రచారంలో ఉన్న ‘హిట్’ సీక్వెల్ గురించి అతను అధికారిక ప్రకటన చేశాడు ఈ ట్వీట్‌లో. ‘హిట్’ సీక్వెల్ గురించి ప్రకటించడానికి ఇంతకంటే మంచి సమయం ఉండదని నాని అన్నాడు.

‘హిట్’ సీక్వెల్ గురించి ప్రకటన చేస్తూ ఒక ట్విస్ట్ ఇచ్చాడు నాని. తెలంగాణకు చెందిన విక్రమ్ రుద్రరాజు ‘హిట్’తో ప్రేక్షకులకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అనుభూతిని ఇచ్చాడని.. ‘హిట్’ సీక్వెల్లో ఏపీకి చెందిన ‘కేడీ’ ఉత్కంఠ భరిత ప్రయాణంలోకి మనల్ని తీసుకెళ్లబోతున్నాడని నాని వెల్లడించాడు. దీన్ని బట్టి ‘హిట్’ కథ నేపథ్యం మారనుందని.. అలాగే హీరో కూడా మారేందుకు ఆస్కారముందని అతను సంకేతాలు ఇచ్చాడు.

నాని మాటల్ని బట్టి చూస్తే ‘హిట్-2’ నేపథ్యాన్ని హైదరాబాద్ నుంచి ఏ వైజాగ్‌కో, విజయవాడకో మార్చే అవకాశముందన్నమాట. అలాగే కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నట్లే సీక్వెల్లో విశ్వక్సేన్ నటించే అవకాశాలు లేనట్లే. అతడి స్థానంలోకి అడివి శేష్ వస్తాడని ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. థ్రిల్లర్ చిత్రాలకు పేరు పడ్డ అడివి శేష్ ఈ ప్రాజెక్టులోకి వస్తే ‘హిట్-2’పై అంచనాలు భారీగా పెరగడం ఖాయం. శైలేష్ కొలను ఇప్పటికే ‘హిట్-2’ బౌండ్ స్క్రిప్టు రెడీ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశముంది.