దిల్ రాజు ‘అభినందన’ వెనుక మర్మమిదా?

ఇటీవల ‘నాంది’ సినిమా బృందం కోసం అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రత్యేకంగా అభినందన సభ ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. నిజానికి ఈ సినిమాతో రాజుకు ఎలాంటి సంబంధం లేదు. చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల.. హరీష్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా రాజు సంస్థలో కొన్ని సినిమాలకు పని చేశాడు తప్పితే.. ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ పరంగా ఈ చిత్రంతో రాజుకు ఏ కనెక్షన్ లేదు.

‘నాంది’ సినిమాతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న రాజు చెబుతూ.. కేవలం ఈ సినిమా నచ్చి చిత్ర బృందాన్ని అభినందించాలనుకున్నానని, ఇలాంటి మంచి చిత్రం ప్రేక్షకులకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయించానని తెలిపాడు. ఐతే ఈ ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ.. ఈ చిత్రంతో రాజుకు వేరే కనెక్షన్ ఉందన్న సమాచారం ఇప్పుడు బయటికి వచ్చింది. ‘నాంది’ రీమేక్ హక్కులను రాజునే కొన్నాడట.

‘నాంది’లో చేయని నేరానికి శిక్ష అనుభవించిన ఒక సామాన్యుడు తనను ఇరికించిన వారిపై చట్టం సాయంతోనే ప్రతీకారం తీర్చుకునే పాయింట్ అన్ని భాషల వాళ్లకూ కనెక్ట్ అవుతుందని, ఈ కాన్సెప్ట్‌గా ఇంకా బాగా, పెద్ద స్థాయిలో తీస్తే వర్కవుట్ అవుతుందని రాజు భావించి.. పలు భాషల్లో ఈ చిత్రాన్ని పునర్నిర్మించాలని భావించాడని, అన్ని భాషలకూ కలిపి మంచి రేటుకు రీమేక్ హక్కులు కొన్నాడని సమాచారం.

ఇప్పటికే ‘జెర్సీ’ రీమేక్‌తో బాలీవుడ్‌లో అడుగు పెడుతున్న రాజు.. ‘నాంది’ని కూడా అక్కడి ఓ అగ్ర నిర్మాణ సంస్థతో కలిసి హిందీలో రీమేక్ చేయబోతున్నాడని అంటున్నారు. ‘నాంది’ టీంను పిలిచి అభినందన సభ ఏర్పాటు చేయడం వెనుక అసలు కారణం ఇదే అని చెబుతున్నారు. ‘నాంది’ అల్లరి నరేష్‌కు ఎనిమిదేళ్ల తర్వాత విజయాన్నందించడమే కాక.. ఇంతగా ప్రశంసలందుకుని, వేరే భాషల్లోకి కూడా రీమేక్ కాబోతోందంటే విశేషమే.