ఆ లెస్బియన్ పాత్ర ఆమె చేయాల్సిందట

సౌత్ సినిమాల్లో లెస్బియన్ పాత్ర చేయమని ఏ హీరోయిన్ని అడిగినా కచ్చితంగా తటపటాయిస్తారు. మెజారిటీ హీరోయిన్లు ‘నో’ అనే చెబుతారు. తాను కూడా అదే పని చేశానని అంటోంది దక్ష నగార్కర్. సీనియర్ దర్శకుడు తేజ రూపొందించిన ‘హోరాహోరి’ సినిమాతో కథానాయికగా పరిచయమై.. ఆ తర్వాత ‘హుషారు’ సహా కొన్ని సినిమాల్లో నటించిన ఈ భామను ‘అ!’ సినిమాలో నిత్యా మీనన్ చేసిన లెస్బియన్ పాత్రకు దర్శకుడు ప్రశాంత్ వర్మ అడిగాడట. కానీ కెరీర్ ఆరంభంలో అలాంటి పాత్ర చేస్తే ఏమవుతుందో ఏమో అని కంగారు పడ్డానని, నో చెప్పానని దక్ష చెప్పింది.

ఐతే ఇప్పుడు తలుచుకుంటే ఆ బోల్డ్ క్యారెక్టర్ చేసి ఉండాల్సింది అనిపిస్తోందని, ఇకపై అలాంటి పాత్రలు వస్తే వదులుకోబోనని దక్ష చెప్పింది. ప్రశాంత్ వర్మ తర్వాతి సినిమా ‘కల్కి’లోనూ తనను నటించమని అడిగాడని.. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయానని ఆమె వెల్లడించింది.

తన కెరీర్లో మరికొన్ని పాత్రలకు తాను నో చెప్పానని.. ఆ సినిమాలేవీ కూడా సరిగా ఆడలేదని దక్ష తెలిపింది. ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ‘జాంబి రెడ్డి’లో తాను మ్యాగీ అనే అల్ట్రా మోడర్న్ గర్ల్‌గా కనిపించనున్నానని.. తాను ఇందులో గేమర్‌గా కనిపిస్తానని ఆమె వెల్లడించింది. ‘మ్యాడ్ మ్యాక్స్’ సినిమాలో ఫ్యూరీ తరహాలో ఈ పాత్ర ఉంటుందని.. తాను వీర లెవెల్లో యాక్షన్ సన్నివేశాలు కూడా చేశానని.. తన పాత్ర ప్రేక్షకులను కచ్చితంగా ఆశ్చర్య పరుస్తుందని దక్ష ధీమా వ్యక్తం చేసింది.

‘జాంబి రెడ్డి’ పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ అని, కాన్సెప్ట్ కొత్తగా ఉంటూనే అందరినీ అలరించే వినోదం ఇందులో ఉందని ఆమె చెప్పింది. ప్రస్తుతం తాను బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమవుతున్న సినిమాలో ఓ కథానాయికగా నటిస్తున్నానని.. లాక్ డౌన్ వల్ల ఈ సినిమా ఆలస్యమైందని, త్వరలోనే పూర్తమవుతుందని, తన కెరీర్లో ఇది మరో మంచి సినిమా అని దక్ష చెప్పింది.