ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్.. ముహూర్తం ఫిక్స్‌?

ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ మొద‌లైంద‌ని ఇటీవ‌ల రాజ‌మౌళి ప్ర‌క‌టించ‌గానే ఎన్టీఆర్ అభిమానులు హ‌మ్మ‌య్య అనుకున్నారు. ఎందుకంటే ఈ సినిమాకు తార‌క్ అంకిత‌మై రెండేళ్లు దాటిపోయింది. రామ్ చ‌ర‌ణ్ అయినా మ‌ధ్య‌లో బ్రేక్ తీసుకుని ఆచార్యలో ప్ర‌త్యేక పాత్ర కోసం షూటింగ్‌కు హాజ‌ర‌వుతున్నాడు. కానీ తార‌క్ ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌కే ప‌రిమితం అవుతున్నాడు.

రాజ‌మౌళితో సినిమా అంటే ఎంత‌కీ తెగ‌ని వ్య‌వ‌హారం. ప‌రిస్థితి చూస్తే తార‌క్ కెరీర్లో మూడేళ్ల గ్యాప్ వ‌చ్చేసేలా క‌నిపించింది. ఈ ఏడాది ఇంకో సినిమా మొద‌లుపెడ‌తాడా లేదా అన్న సందేహాలు కూడా క‌లిగాయి ఒక స‌మ‌యంలో. ఐతే క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ‌తో ఆర్ఆర్ఆర్ షూటింగ్ దాదాపు అయిపోతుంద‌ని, తార‌క్ ఇంకో రెండు నెల‌ల్లో ఈ సినిమా నుంచి విముక్తుడ‌వుతాడ‌ని సంకేతాలు రావ‌డం అత‌డి అభిమానులకు ఉత్సాహాన్నిస్తోంది.

మ‌రి కొన్ని నెల‌ల్లోనే తార‌క్ త్రివిక్ర‌మ్‌తో తన కొత్త చిత్రాన్ని మొద‌లుపెట్ట‌డానికి రంగం సిద్ధం చేస్తున్న‌ట్లు తాజా స‌మాచారం అందుతోంది. మే 20న త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమాకు కొబ్బ‌రికాయ కొడ‌తాడ‌ట‌. అక్క‌డ్నుంచే రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొద‌ల‌వుతుంద‌ట‌. త్రివిక్ర‌మ్ కూడా ఏడాదికి పైగా ఖాళీగా ఉన్న నేప‌థ్యంలో ఇంకెంత‌మాత్రం ఆల‌స్యం చేయాల‌నుకోవ‌ట్లేదు.

అర‌వింద స‌మేత త‌ర్వాత వీళ్లిద్ద‌రూ మ‌రోసారి హారిక అండ్ హాసిని బేన‌ర్లోనే ఈ సినిమాచేయ‌నున్నారు. ఆ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన త‌మ‌నే దీనికీ సంగీత ద‌ర్శ‌కుడు. తార‌క్ స‌ర‌స‌న ఓ క‌థానాయిక‌గా జాన్వి క‌పూర్‌ను తీసుకుందామ‌ని అనుకుంటున్నార‌ట‌. ఈ చిత్రం రాజ‌కీయాల నేప‌థ్యంలో న‌డుస్తుందంటున్నారు. అయిన‌నూ పోయి రావ‌లె హ‌స్తిన‌కు అనే టైటిల్ ఈ చిత్రానికి ప్ర‌చారంలో ఉన్న సంగ‌తి తెలిసిందే.