ఇక్కడ పవన్.. అక్కడ మహేష్


టాలీవుడ్ టాప్ స్టార్లు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తమ కొత్త సినిమాలను చడీచప్పుడు లేకుండా మొదలుపెట్టేస్తున్నారు. మహేష్ మొదలుపెట్టాల్సిన కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ అన్న సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు ఏడాది తర్వాత మహేష్ మేకప్ వేసుకుంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ అనుకున్నదానికంటే ఆలస్యంగా ఇప్పుడే మొదలవుతోంది. ఐతే తొలి షాట్ తీస్తోంది ఇండియాలో కాదు.. ఫారిన్లో.

‘సర్కారు వారి పాట’ తొలి షెడ్యూల్ దుబాయ్‌లో ప్లాన్ చేసింది చిత్ర బృందం. అందుకోసం ఇప్పటికే చిత్ర బృందమంతా అక్కడికి చేరుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న కీర్తి సురేష్ దుబాయ్‌కి వెళ్తూ ఫ్లైట్ నుంచి ఫొటోలు కూడా పెట్టిన సంగతి తెలిసిందే. మహేష్ సైతం ఇప్పటికే అక్కడికి చేరుకున్నాడు. ‘గీత గోవిందం’ తర్వాత పరశురామ్ తీస్తున్న సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఉమ్మడిగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చడీచప్పుడు లేకుండా తన కొత్త సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లిపోయాడు. ఆ చిత్రమే.. అయ్యప్పనుం కోషీయుం రీమేక్. ఇటీవలే ‘వకీల్ సాబ్’ను పూర్తి చేసిన పవన్.. క్రిష్ దర్శకత్వంలో సినిమాను పున:ప్రారంభించాడు. ఆ షూటింగ్‌లో పాల్గొంటూనే.. అయ్యప్పనుం కోషీయుం రీమేక్‌ను కూడా పూర్తి చేయాలని పవన్ నిర్ణయించుకున్నాడు. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

రానా ఇందులో పవన్‌ను ఢీకొట్టే పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సోమవారమే మొదలైంది. రాజకీయ కార్యక్రమాల కోసం కొన్ని రోజులు విరామం తీసుకున్న పవన్.. నేరుగా ఈ సినిమా షూటింగ్‌కు హాజరు కానున్నాడు. తర్వాత మళ్లీ బ్రేక్ తీసుకుని క్రిష్ సినిమా మీదికి వెళ్తాడు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న సంగతి తెలిసిందే.