మహా శివరాత్రికి మ్యాడ్ రష్


ఫిబ్రవరి, మధ్య నుంచి మార్చి మధ్య వరకు అన్ సీజన్‌గా భావిస్తారు మామూలు. ఈ టైంలో పేరున్న సినిమాలు రిలీజ్ కావు. చిన్నా చితకా సినిమాలలను లాగించేస్తుంటారు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అన్ సీజన్లోనే సినిమాల మోత చూడబోతున్నాం. అలాగని అవేమీ చిన్నా చితకా సినిమాలు కావు. మీడియం రేంజ్, క్రేజ్ ఉన్న సినిమాలే.

నితిన్-చంద్రశేఖర్ యేలేటిల కలయికలో తెరకెక్కిన ‘క్రాక్’ ఫిబ్రవరి 19న రాబోతుండగా.. మార్చి 11న మహా శివరాత్రి కానుకగా శర్వానంద్ సినిమా ‘శ్రీకారం’ విుడదల ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. ఐతే ఆ సినిమా రిలీజ్ డేట్ ఇచ్చిన కొన్ని గంటలకే మరో చిత్రం మహా శివరాత్రి రేసులోకి వచ్చేసింది. స్వప్న సినిమా పతాకంపై ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాణంలో తెరకెక్కిన ‘జాతిరత్నాలు’ కూడా అదే రోజుకు రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు.

నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామృష్ణ లాంటి మంచి కామెడీ టచ్ ఉన్న నటులు కలిసి నటించిన ఈ చిత్రాన్ని ‘పిట్టగోడ’ ఫేమ్ అనుదీప్ రూపొందించాడు. దీని ప్రోమోలన్నీ ప్రేక్షకుల దృష్టిన ిఆకర్షించాయి. ఒక ఆసక్తికర ప్రోమోతో.. ‘‘ఇంట్లో కాదు.. థియేటర్లలో చూసుకుందాం రండి. నవ్వుకుందాం’’ అనే ఫన్నీ క్యాప్షన్‌తో రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్ర బృందం.

మరోవైపు మహాశివరాత్రికి ఇంకో సినిమా కూడా రాబోతున్నట్లు సమాచారం. అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి స్క్రిప్టుతో ‘అలా ఎలా’ ఫేమ్ అనీష్ కృష్ణ రూపొందించిన ‘గాలి సంపత్’ సైతం శివరాత్రి కానుకగా మార్చి 11నే వస్తుందట. రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం మార్చి 11న రిలీజ్ అని డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం వెళ్లిపోయింది. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని పంపిణీ చేయనున్నారట. గత ఏడాది మార్చి రెండో వారంలో ‘మధ’ అనే చిన్న సినిమా ఒక్కటే విడుదలైంది.

2020 అనే కాదు.. ఎప్పుడూ కూడా మార్చి రెండో వారంలో పేరు లేని సినిమాలే వస్తుంటాయి. అలాంటిది ఈసారి మహా శివరాత్రి పండుగ వచ్చేసరికి మూడు సినిమాలు విడుదలకు సిద్ధమైపోయాయి. వేసవిలో అస్సలు ఖాళీ లేకపోవడం, విడుదల కోసం చాలా చిత్రాలు ఎదురు చూస్తుండటంతో అన్ సీజన్లో కూడా మ్యాడ్ రష్ చూడబోతున్నామన్న మాట.